ప్రియురాలితో కలిసి గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
ఖమ్మం, సెప్టెంబర్ 04 (ఇయ్యాల తెలంగాణ) : ఒడిశాలోని పసుపులంకలో రూ.16 వేలతో 12 కిలోల గంజాయి కొనుగోలు చేసి, రూ.6 లక్షలకు హైదరాబాద్లో విక్రయించేందుకు పెద్దపల్లికి చెందిన మిత్ర చైతన్య(21), హేమలత(20) అనే ప్రేమ జంట ద్విచక్ర వాహనంపై గంజాయిని తరలిస్తోంది. ఖమ్మం జిల్లా వైరా క్రాస్రోడ్డు వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి, బైక్ ఆపకుండా పారిపోయే ప్రయత్నం చేసారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని నాలుగు సెల్ఫోన్లు, గంజాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రియురాలి బర్త్డేకు ఐఫోన్ కొనివ్వాలని గంజాయి విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో మిత్ర చైతన్య వెల్లడించారు. వీరికి గంజాయి విక్రయించిన భగవాన్ హంతాల్ అనే వ్యక్తితో పాటు, హైదరాబాద్లో వీరి నుంచి గంజాయి కొనాల్సిన శశి, నాగుల అనే వ్యక్తులు పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.