వరంగల్, ఫిబ్రవరి 24, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న కొందరు కేటుగాళ్లు వాటిని బీర్ల తయారీ కంపెనీలకు పంపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. రేషన్ బియ్యాన్ని నేరుగా పంపితే, సోదాల్లో దొరికిపోతామని తెలివిగా వాటిని నూకలుగా మార్చుతున్నారు. అనంతరం తెలంగాణ సహా మహారాష్ట్ర, కర్ణాటకలోని బీర్ల తయారీ సంస్థలకు పంపిస్తున్నారు. దొడ్డు బియ్యంలో గంజి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే, అది మిగతా పదార్థాలతో కలిసి త్వరగా పులుస్తుంది. దొడ్డు బియ్యం తక్కువ ధరకు కూడా దొరుకుతుండడంతో బెవరేజస్ సంస్థలు ఈ బియ్యాన్ని అధికంగా కొంటున్నాయి.ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లోని రేషన్ బియ్యాన్ని రాత్రి సమయంలో నూకలుగా చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 225 ఇటువంటి కేసులు గత ఏడాది నమోదయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ ప్రతి ఏడాది దాదాపు 150 కేసులు నమోదవుతున్నాయి. ఇటువంటి పనులకు పాల్పడుతున్న వారిలో దళారులుగా ఉన్నవారిలో అత్యధికులు రౌడీషీటర్లే. మరోవైపు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోనూ ఇటువంటి తతంగమే నడుస్తోంది. బీర్ల కంపెనీలకు తరలించడం కోసం.. కొందరు దొడ్డు బియ్యాన్ని ఎలా సేకరిస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.రేషన్ నుంచి దొడ్డు బియ్యం అవసరం లేదని కొందరు లబ్ధిదారులు అనుకుంటారు. వారి నుంచి కిలోకు రూ.10 చొప్పున చెల్లించి కొంటున్నారు. వాటిని మిల్లర్లకు కిలోకు రూ.15 నుంచి రూ.18 చొప్పున అమ్ముతున్నారు. వాటిని మిల్లర్లు నూకలుగా చేయించి బెవరేజస్ కంపెనీలకు రూ.25 నుంచి రూ.35 మధ్య అమ్ముకుంటున్నారు