హైదరాబాద్, జూన్ 29 (ఇయ్యాల తెలంగాణ): వాహనదారులకు అలర్ట్.. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అంత సులువు కాదు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి, వాహనదారులలో ట్రాఫిక్ నియమాలపై పూర్తి అవగాహన పెంచడానికి రవాణాశాఖ సరికొత్త నిబంధనలను తీసుకువస్తోంది. గతంలో లాగా కేవలం వెహికల్ నడపడం వస్తే సరిపోదు. ఇకనుంచి ఆర్టీఏ నిబంధనల ప్రకారం అగ్నిపరీక్షలు పాస్ కావాల్సిందే. ఇందుకోసం రవాణాశాఖ సరికొత్త విధివిధానాలను రూపొందిస్తోంది. ఈ కొత్త విధానం ప్రకారం లైసెన్స్ ప్రక్రియ ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకుందాం.
కొత్త పరీక్షల విధానం:
మొదటి దశ : ఎలఎలఆర్ కోసం స్లాట్ బుక్ చేసుకుని, ఆన్లైన్ పరీక్షలో పాస్ కావాలి. ఇందులో ట్రాఫిక్ నియమాలపై కనీస అవగాహనను పరీక్షిస్తారు.
2 ఆన్లైన్ టెస్టులు: ఎలఎలఆర్ వచ్చిన తర్వాత, తుది డ్రైవింగ్ టెస్ట్కు వెళ్లే లోపు అభ్యర్థులు మరో రెండు ఆన్లైన్ పరీక్షలు అటెండ్ అయ్యి, పాస్ కావాల్సి ఉంటుంది. వీటిని అభ్యర్థులు తమ ఇంటి నుంచే రాసుకోవచ్చు
డ్రైవింగ్ టెస్ట్: పైన పేర్కొన్న ఆన్లైన్ పరీక్షల్లో పాసైన వారికి మాత్రమే టెస్ట్ ట్రాక్పై వాహనం నడిపేందుకు అనుమతి ఇస్తారు. ఏ దశలో ఫెయిలైనా మళ్లీ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
అవగాహన వీడియోలు & మార్పులు:
వీడియోల వీక్షణ: ఆన్లైన్ టెస్టులు రాయడానికి ముందు అభ్యర్థులు రహదారి భద్రత, డ్రైవింగ్ మెళకువలు, అతివేగం వల్ల జరిగే నష్టాలపై రవాణాశాఖ రూపొందించిన 2 నుండి 3 గంటల నిడివి గల వీడియోలను చూడాల్సి ఉంటుంది.
వాహన్ సారథి పోర్టల్: ఈ కొత్త నిబంధనలకు అనుగుణంగా త్వరలోనే ‘వాహన్ సారథి’ అనే పోర్టల్లో మార్పులు చేయనున్నారు.
దళారుల నియంత్రణకు బయోమెట్రిక్:

ఇకనుంచి ఏజెంట్ ల జోక్యాన్ని పూర్తిగా తగ్గించే విధంగా చర్యలు చేపట్టనున్నారు అధికారులు. టెస్ట్ ట్రాక్ల వద్ద ఏజెంట్లు, దళారుల జోక్యాన్ని అరికట్టడానికి, పరీక్షలు నిర్వహించకుండానే లైసెన్సులు ఇస్తున్నారనే ఆరోపణలకు చెక్ పెట్టడానికి రవాణాశాఖ బయోమెట్రిక్ (వేలిముద్రల) విధానాన్ని తప్పనిసరి చేయనుంది. మరీ ముఖ్యంగా 25 నుండి 30 ఏళ్ల లోపు యువత అజాగ్రత్త, ర్యాష్ డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా కాపాడటమే ఈ కొత్త విధానం యొక్క ముఖ్య ఉద్దేశంగా అధికారులు చెపుతున్నారు. మరి, ఈ కొత్త నిబంధనలు ఎప్పటినుంచి అమలులోకి రానున్నాయి అనేది చూడాలి.
=========================
