హైదరాబాద్, మార్చి 24 (ఇయ్యాల తెలంగాణ) :టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందని,కరోనాతో కుదేలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలపై కరెంట్ ఛార్జీల పెంపుతో మోయలేని భారాన్ని మోపిందని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ అన్నారు.పేదల నడ్డి విరుస్తోంది. కరెంట్ ఛార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలపై ఏకంగా 6 వేల కోట్ల రూపాయల భారాన్ని మోపడం దారుణమని ధ్వజమెత్తారు. పాతబస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయడం చేతగాని కేసీర్ ఫ్రభుత్వం ఆ భారాన్ని సామాన్యులపై మోపడం అన్యాయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్లకు చెల్లించాల్సిన రూ.48 వేల కోట్ల బకాయిలు ఇంతవరకు చెల్లించక పోవడం దారుణమని, అలాగే డిస్కంలకు వినియోగదారులు చెల్లించాల్సిన కరెంట్ బకాయిలు రూ.17 వేల కోట్లుండగా…. అందులో ప్రభుత్వ శాఖలకు చెందిన బకాయిలే రూ. 12,598 కోట్లు ఉండటం దారుణ మని మంది పడ్డారు.
వినియోగదారులు చెల్లించాల్సిన బకాయిలు రూ. 4603 కోట్లు కాగా… అందులో అత్యధికంగా పాతబస్తీకి చెందినవేనని అన్నారు. ప్రభుత్వం ఒకవైపు తన శాఖలు వాడుకున్న కరెంట్ కు బిల్లులు చెల్లించడం లేదు… మరోవైపు పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేసే దమ్ము లేదు… కానీ ఈ లోటును పూడ్చుకునేందుకు సామాన్య ప్రజలపై ఛార్జీల పెంపు పేరుతో భారం మోపడం ఎంత వరకు సమంజసం? కరెంట్ ఛార్జీలు తగ్గించేవరకు బీజేపీ పోరాడుతుంది. అందులో భాగంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కరెంటు ఛార్జీల పెంపుపై ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం. పేదల నుండి మధ్య తరగతి వరకు ఎవరినీ వదలకుండా ఛార్జీల పెంపుతో కరెంటు షాక్ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు షాక్ ఇచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అయన అన్నారు.