Telangana హైడ్రా …రూట్‌ మార్పు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30, (ఇయ్యాల తెలంగాణ) : హైడ్రా.. ఈ మధ్య కాలంలో ఇంతలా వినిపించిన పేరు మరొకటి లేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి చోట వినిపిస్తున్న పేరు ఇది. చెరువులు, కుంటలు ఆక్రమించి కట్టుకున్న నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీలోనే చాలా మంది ఎమ్మెల్యేలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రతిపక్షం సరే సరే. ఏకంగా హైడ్రా బాధితుల పేరిట ఓ ఉద్యమాన్నే సిద్దం చేసింది బీఆర్‌ఎస్‌. ఆ బాటలోనే పయణిస్తోంది బీజేపీ కూడా. ఇప్పటి వరకు హైడ్రా తీసుకుంటున్న చర్యలు సమర్ధిస్తూ వస్తున్నప్పటికీ ఈ మధ్య కాలంలో మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాయ కష్టం చేసి కట్టుకున్న ఇళ్లను నిట్టనిలువునా కూల్చేస్తుంటే కొందుర పేదలు రోడ్డున పడుతున్నారు. అధికారులు అన్ని అనుమతులు ఇచ్చిన ఇళ్లపై కూడా హైడ్రా బుల్డోజర్లు చేయి వేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. అందుకే కూల్చివేతల టైంలో హైడ్రామాలు చూస్తున్నాం. ఈ హైడ్రా చర్యలకు తోడు ఈ మధ్య మూసి నిర్వాసితులు కూడా చేరారు. మూసీ ప్రక్షాళన కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కూడా విమర్శలు వెల్లువెత్తున్నాయి. మూసీ నదిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను గుర్తించి రెడ్‌ మార్క్‌ వేస్తున్నారు అధికారులు. దీన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. 

ఇలా ఓవైపు హైడ్రా, రెండో వైపు మూసీ ప్రక్షాళన పేరుతో ప్రజలను రోడ్డున పడేస్తోందీ ప్రభుత్వం అని ప్రతిపక్షాలు ఉద్యమ బాట పట్టాయి. బీఆర్‌ఎస్‌, బీజేపీ పోటాపోటీన ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి.ఇప్పటి వరకు సాఫీగా సాగిన ఈ యజ్ఞంలో ఇప్పుడు సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న అధికార పార్టీ వాళ్లు కూడా స్వరాలు సవరించుకుంటున్నారు.  అన్నింటినీ గమనించిన ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసింది. హైడ్రా విషయంలో ప్లాన్‌ మార్చినట్టు తెలుస్తోంది. మరోవైపు మూసీ ప్రక్షాళన విషయంలో కూడా పునరాలోచనలో పడ్డట్టు చెబుతున్నారు. పెద్దలను వదిలేసి పేదల కట్టడాలనే కూలుస్తుందనే అపవాదును మూటగట్టుకుంటున్న హైడ్రా ఇకపై పెద్దలపై ఫోకస్‌ పెట్టింది. చెరువులు ఆక్రమించి, బఫర్‌ జోన్‌లో, ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన బడా బాబుల నిర్మాణాలపైకి బుల్డోజర్లు వెళ్లనున్నాయి. అలాంటి వారి కట్టడాలపై చర్యలు తీసుకున్న తర్వాత మిగతా వాటి గురించి ఆలోచిస్తామని హైడ్రా అధికారులు చెబుతున్నారు. మొదట్లో ఇలాంటి కట్టడాలను కూల్చేసి అందరి దృష్టిలో పడ్డ హైడ్రా తర్వాత వాటి సంగతి మర్చిపోయిందనే విమర్శ ఉంది. అందుకే ఆలాంటి విమర్శలు, ఆరోపణలకు చెక్‌ పెట్టేందుకు పెద్ద తలకాయల కట్టాడలపై ఫోకస్‌ పెట్టిందట. మరోవైపు ఆపరేషన్‌ మూసీ విషయంలో కూడా ఆచితూచి ముందడుగు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మూసీ చుట్టు ఉన్న బడా బాబుల నిర్మాణాల పని పట్టనుంది. ఆ తర్వాత మిగతా ప్రజల కట్టడాల జోలికి వెళ్లనుంది. వారితో మాట్లాడి ఒప్పించి కూల్చేందుకు కార్యచరణ సిద్ధం చేసింది. మూసీ నిర్వాసితులకు ఇచ్చే ప్యాకేజీ, ఇతర సదుపాయాలపై విస్తృత ప్రచారం కల్పించిన తర్వాత ముందుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....