Hotels లో “యదేఛ్చగా కల్తీ ఆహారం – జర భద్రం”

హోటళ్లలో యదేఛ్చగా కల్తీ – ఆహారం – జర భద్రం..

హైదరాబాద్‌, మే 24 (ఇయ్యాల తెలంగాణ) : సందర్భం ఏదైనా, వారం ఏదైనా భాగ్యనగరం హైదరాబాద్‌లో చాలా మంది రెస్టారెంట్‌కు వెళ్లాల్సిందే! ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌తో మొదలు మధ్యాహ్నం లంచ్‌, రాత్రికి డిన్నర్‌తో సహా అన్నీ హోటల్లోనే కడుపు నిండా తినేస్తారు. వినియోగదారుల అవసరాన్ని హోటళ్లు, రెస్టారెంట్లు అవకాశంగా మలుచుకుంటున్నాయి. రకరకాల ఫ్లేవర్లు కలుపుతూ కష్టమర్ల కడుపుకు ఫుడ్‌ బదులు పాయిజన్‌ పెడుతున్నారు రెస్టారెంట్‌, హోటల్‌ యజమానులు. పురుగులు పడిన చికెన్‌ను ఫ్రై చికెన్‌గా,  పాచిపోయిన చికెన్‌ను తందూరి చేసి కష్టమర్లకు వడ్డిస్తున్నారు. ఒక్క చికెనే కాదు, మటన్‌, చేపలు, రొయ్యలు, రోటీ, ఐస్‌ క్రీములు ఇలా అన్నీ కల్తీ చేసి వినియోగదారులకు కడుపు నిండా పెడుతూ రోగాల బారిన పడేటట్లు చేస్తున్నారు.భాగ్యనగరంలోని పెద్ద పెద్ద హోటల్స్‌, రెస్టారెంట్లలో అధికారులు చేస్తున్న తనిఖీల్లో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నాణ్యత లేని ఆహారం సరఫరా చేస్తూ వినియోగదారుల జేబు ఖాళీ చేయడంతో పాటు వారి ఆరోగ్యాన్ని సైతం నాశనం చేస్తున్నారు హోటల్‌ నిర్వాహకులు. హైదరాబాద్‌లో హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్‌ సేఫ్టీ టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు గత కొద్ది రోజులుగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతి చోటా ప్రిడ్జ్‌ల్లో స్టోర్‌ చేసినవి, గడువు ముగిసిన మాంసం, వస్తువులను వంట కోసం ఉపయోగిస్తున్నట్లు గుర్తించి సీజ్‌ చేశారు. చాలా చోట్ల నాణ్యత లేని ఆహారం గుర్తించి వాటి నమూనాలను నాచారం ల్యాబ్‌కు పంపించారు. రిపోర్ట్స్‌ వచ్చిన వెంటనే కల్తీ, నాణ్యత లేని ఆహారం తయారు చేస్తున్న రెస్టారెంట్లు, హోటళ్లపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.హైదరాబాద్‌లో గొప్పగా చెప్పుకునే ఏ ఒక్క హోటల్‌లో ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహారం దొరకడం లేదు. వంట చేసేందుకు వాడిన నూనెలే మళ్లీ మళ్లీ వాడుతున్నారు. ఫ్రిడ్జ్‌లో భద్రపరచాల్సిన ఆహార ఉత్పత్తులు ఎక్కడ పడితే అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు గుర్తించారు. 

కొన్నింటికి  అవసరమైన మెడికల్‌ అనుమతులు కూడా లేవు. కొన్ని హోటల్స్‌ కిచెన్స్‌ మురుగు కాల్వల పక్కనే ఉన్నాయి.  ఫైవ్‌ స్టార్‌ ఫుడ్‌ కోర్టులు, ఇక ఐస్‌ క్రీమ్‌ పార్లర్లు, బేకరీలు, ప్రమాదకర రంగులు, ఇతర కెమికల్స్‌ ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించి అవాక్కయ్యారు. హైదరాబాద్‌లో ఉంటూ హోటల్‌ ఫుడ్‌ ఇష్టపడేవారు ఇకనైనా మేల్కోకపోతే విూ ఆరోగ్యాన్ని విూ చేజేతులా నాశనం చేసుకున్నట్లే. ప్రముఖ హోటట్‌ బాహుబలి కిచెన్‌లో ఆహారం రుచిగా ఉండేందుకు సింథటిక్‌ ఫుడ్‌ కలర్స్‌ను ఉపయోగిస్తున్నారు. అలాగే వంటగదిలో ఆహార పదార్థాలపై  బొద్దింకలు తిరగాన్ని ఫుడ్‌ సేఫ్టీ అధికారులు గుర్తించారు. మాదాపూర్‌ ప్రాంతంలో గురువారం ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనీఖీలు నిర్వహించారు. రామేశ్వరం కేఫ్‌లో 16 వేలు విలువ చేసే గడువు ముగిసిన మినపపప్పు 100 కేజీలు, పెరుగు 10 కేజీలు, పాలు 8 లీటర్లు గుర్తించారు. బంజారాహిల్స్‌ బాస్కిన్‌ రాబిన్స్‌లో గడువు ముగిసిన వైట్‌ చాక్లెట్స్‌ను కనుగొన్నారు. లాబొనెల్‌ ఫైన్‌ బేకింగ్‌ ఇన్‌లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న వెనిగర్‌ గుర్తించారు. 

వాటిపై దిగుమతిదారుడి పేరు, లైసెన్సులు లేవు. ఫుడ్‌ హ్యాండ్లర్‌ మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల గడువు మార్చి 15న ముగిసినట్లు గుర్తించారు. కృతుంగా, మాస్టర్‌ చెఫ్‌, రెస్టో ఓ బార్‌, కామత్‌ హోటల్‌, జంబో కింగ్స్‌ బర్గర్‌ హోటల్లో సైతం కల్తీ, నిల్వ ఉంచిన ఆహారం వినియోగదారులకు అంటగడుతున్నారు. క్రీమ్‌ స్టోన్‌, నాచురల్‌ ఐస్‌ క్రీమ్‌, కరాచీ బేకరీ, కెఎఫ్‌సీ, రోస్టరే కేఫ్‌, హౌస్‌ రాయలసీమ, రుచుల్‌ షా, గౌస్‌ కామత్‌ హోటల్‌, 36 డౌనింగ్‌ బ్రూ పబ్‌, మకావ్‌ కిచెన్‌ అండ్‌ బార్‌, ఎయిర్‌ లైవ్‌, టాకోబెల్‌, ఆహా దక్షిణ్‌, సిజ్జల్‌ జో, ఖాన్‌సాబ్‌, హోటల్‌ సుఖ్‌సాగర్‌ వెజ్‌ రెస్టారెంట్‌, జుంబో కింగ్‌ బర్గర్స్‌, రతన్‌దీప్‌ రిటైల్‌ స్టోర్‌ నాసిరకం ఆహారం విక్రయిస్తున్నాయి.హైదరాబాద్‌ వ్యాప్తంగా అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల్లో ప్రతి హోటల్‌, రెస్టారెంట్‌లో ఆహార కల్తీ జరుగుతోంది. ఇదే కొనసాగితే వాటిని తినేవారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. హానికరమైన రంగులు, రసాయనాలు మనిషికి ప్రాణాంతక కేన్సర్‌ రావడానికి కారణమవుతాయి. జీర్ణాశయం దెబ్బతిని అల్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. గుండె, మూత్రపిండాలు, కాలేయం పాడై పనిచేయడం మానేస్తాయి. ఫలితంగా ప్రాణాలకే ముప్పు ఏర్పడొచ్చు. కడుపునొప్పి, కీళ్ల నొప్పులు, విరేచనాలు కలిగి మెదడు పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఆహారం రుచిగా ఉండేందుకు ఉపయోగించే రసాయనిక పదార్థాలు మెదడు, ఎముకలపై ప్రభావం చూపుతాయి. అలాగే కల్తీ ఆహారంతో చర్మంపై దద్దులు, మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....