నిజామాబాద్, జూలై 17 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఖరారుతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. హైకోర్టు ఆదేశాలతో సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించి ఐదు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం యోచిస్తున్నట్లు సమాచారం. మరి గ్రావిూణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే..స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసింది. మొత్తం 566 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు, అలాగే రాష్ట్రవ్యాప్తంగా 5,773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ క్షణంలోనైనా జరగవచ్చనే సంకేతాలను వెలువడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేయాలని తెలంగాణ ప్రభుత్వం పంచాయితీ రాజ్ శాఖను ఆదేశించింది. ఎన్నికలకు అవసరమయ్యే సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని కూడా నిర్దేశించింది.సెప్టెంబర్ 30వ తేదీలోగా తెలంగాణలో స్థానిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేసింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అవసరమైన ఆర్డినెన్స్ను సిద్ధం చేసి ఇప్పటికే గవర్నర్కు పంపింది.
గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు అధికారికంగా తెరలేవనుంది.రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఐదు విడతల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వర్షాకాలం, శాంతిభద్రతల పరిస్థితి, గిరిజన ప్రాంతాలకు పోలింగ్ సిబ్బంది రవాణా, పోలింగ్ మెటీరియల్ తరలింపు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2019లో ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించగా, అప్పుడు వేసవి కావడంతో అది సాధ్యమైంది.ఇప్పుడు వర్షకాలం కావడం, దానివల్ల ఎదురయ్యే ఇబ్బందులను అంచనా వేసి ఈసారి ఐదు విడతల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రభుత్వం రిజర్వేషన్ల సమాచారాన్ని అందించిన వెంటనే ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు కసరత్తు జరుగుతోంది. పోలింగ్ స్టేషన్లు, ఓటరు జాబితాను ఎన్నికల కమిషన్ అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఐదు విడతల్లో ఎన్నికలు నిర్వహించడం వల్ల పోలింగ్ సిబ్బంది, పోలీసుల తరలింపు సులువు అవుతుందని, పర్యవేక్షణలోనూ ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. వర్షాల వల్ల రవాణాకు, ఓటింగ్కు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయానికి వచ్చారు.
నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి పోలింగ్ వరకు మధ్య ప్రక్రియను పూర్తి చేయడానికి దాదాపు 15 రోజుల సమయం అవసరం. 2019 ఎన్నికల సమయంలో ఒక్కో దశకు నాలుగు రోజుల విరామం ఇవ్వగా, ఈసారి రెండు నుంచి మూడు రోజులు మాత్రమే ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం రిజర్వేషన్ల సమాచారం అందించిన తర్వాత, పోలీసు అధికారులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రెండు ఎన్నికలకు ఒకే రోజు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికలు రాష్ట్రంలో గ్రావిూణ, మండల స్థాయిలో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి మార్గం సుగమం చేయనున్నాయి.