BRS జాబితాలో మార్పులు చేర్పులు తప్పవా !?

హైదరాబాద్‌ ఆగష్టు 29 (ఇయ్యాల తెలంగాణ ):తొలి, మలి అని లేకుండా ఒకటే జాబితాలో ఏకంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ వారిలో కొందరిని చివరి నిమిషంలో మార్చేస్తారా..? సుమారు 20 మందికి బీఫామ్‌ ఇవ్వడం కష్టమేనా..? ఆ స్థానాల్లో కొందరు కొత్త వ్యక్తులు, సిట్టింగ్‌లనే మళ్లీ అభ్యర్థులుగా ప్రకటిస్తారా..? మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాలపై కేసీఆర్‌ ప్రత్యేకంగా నిఘా పెట్టారా..? అంటే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇవన్నీ అక్షరాలా నిజమేనని తేలింది. ఇంతకీ ప్రచారం జరుగుతున్న ఆ నియోజకవర్గాలు ఏంటి..? మంత్రి కేటీఆర్‌ విదేశాల నుంచి వచ్చిన తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా..?

అసలేం జరుగుతోంది; ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఊహకందని రీతిలో ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించి కేసీఆర్‌ వ్యూహాత్మకంగా అడుగులేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రకటన అలా వచ్చిందో లేదో పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లు, టికెట్‌ ఆశించిన ఆశావాహులు, కీలక.. ముఖ్యనేతలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహానికి లోనవుతున్నారు. వీరిలో కొందరు సిట్టింగ్‌లు గులాబీ పార్టీకి గుడ్‌ బై చెప్పేయడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. మరికొందరు సిట్టింగులు, ఆశావాహులు అభిమానులు, కార్యకర్తలు, అనుచరులతో సమావేశాల తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించబోతున్నారు. ‘బాబోయ్‌.. ఈయనకు ఎందుకు టికెట్‌ ఇచ్చారు..’ అని అధిష్టానాన్నే ప్రశ్నిస్తున్నారు. ఇక ఎక్కడ చూసినా అధిష్టానంపై సొంత పార్టీ నేతలు తిరుగుబాటు చేస్తుండటం, రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తుండటం, కాంగ్రెస్‌, బీజేపీ వైపు పలువురు అడుగులేస్తుండటం లాంటివి జరుగుతున్నాయి. అయితే విశ్వసనీయవర్గాలు, బీఆర్‌ఎస్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు కేసీఆర్‌ ప్రకటించిన జాబితాలోని సుమారు 20 మంది అభ్యర్థులకు (20 బీఫామ్‌ కష్టమేనని తెలిసింది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు టికెట్లు ఇవ్వమని చెప్పేస్తే పక్క చూపులు చూస్తారని.. తద్వారా క్యాడర్‌ దెబ్బతింటుందనే ఉద్దేశంతో ప్రస్తుతానికి ప్రకటించినప్పటికీ తర్వాత మార్పులు, చేర్పులు చేయాలనే కేసీఆర్‌ ఇలా చేశారట. చివరి నిమిషంలో టికెట్‌ ఇవ్వమని చెబితే.. అప్పటికప్పుడు తిరుగుబాటు చేసి వేరే పార్టీలో చేరినా పెద్దగా మైలేజీ ఉండదని, కొత్త గుర్తుపై కష్టమేనని బీఆర్‌ఎస్‌ భావిస్తోందట. ఇప్పటికిప్పుడు టికెట్‌ ఇవ్వమని పెద్ద సునావిూని క్రియేట్‌ చేసుకోవడం కంటే.. ఎన్నికలు సవిూపించాక ఆచితూచి నిర్ణయం ప్రకటిస్తే సరిపోతుందని బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఫిక్స్‌ అయ్యిందట.

కేటీఆర్‌ వచ్చాకే..!  ‘ఈ జాబితాలోని 115 మంది అభ్యర్థులు ఫైనల్‌ కాదు.. మున్ముందు మార్పులు, చేర్పులు కచ్చితంగా ఉంటాయి’ అని అభ్యర్థుల జాబితా ప్రకటించిన రోజే కేసీఆర్‌ క్లియర్‌ కట్‌గా చెప్పేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. వాస్తవానికి కేసీఆర్‌ ప్రకటన చేసినప్పట్నుంచే టికెట్‌ దక్కించుకున్నా కొందరు ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది. అయితే తాజా వచ్చిన ఈ సమాచారం ఆ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. ఎప్పుడు ఎలాంటి ప్రకటన వస్తుందో.. చివరికి ఏం జరుగుతుందో..? అసలు పార్టీ తరఫున పోటీచేస్తానో లేదో..? అని టికెట్‌ దక్కించుకున్న నేతలు ఆలోచనలో పడ్డారట. కొందరైతే కేసీఆర్‌ ఇదేగానీ చేస్తే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేదానిపై కాంగ్రెస్‌ పెద్దలతో టచ్‌లోకి కూడా వెళ్లినట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే.. విదేశాల్లో ఉన్న మంత్రి కేటీఆర్‌ త్వరలోనే హైదరాబాద్‌ రానున్నారు. వాస్తవానికి చాలా మంది మార్చాలని కేటీఆర్‌ పట్టుబట్టినప్పటికీ కేసీఆర్‌ మాత్రం అవన్నీ పట్టించుకోలేదట. దీంతో ఆయన వచ్చాకే మార్పులు, చేర్పులు ఉంటాయని వార్తలు గుప్పుమంటున్నాయి. మరోవైపు.. తన మిత్రుల్లో కొందరు.. కావాల్సిన మరికొందరికి కేసీఆర్‌ టికెట్లు ఇవ్వలేదట. వారిలో కొందరి కేటీఆర్‌ వచ్చాక టికెట్‌ ప్రకటించే ఛాన్స్‌ ఉంది.

ఈ స్థానాల్లోనే మార్పు..!  ఎక్కడెక్కడ అయితే అసంతృప్తి, ఆందోళనలు ఎక్కువయ్యాయో ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే కేసీఆర్‌ రహస్య సర్వే కూడా చేయించినట్లుగా భోగట్టా. ఆ సర్వేలు సిట్టింగ్‌లను, టికెట్‌ దక్కించుకున్న కొత్త వ్యక్తులను కలవరపాటుకు గురిచేస్తున్నాయట. కోదాడ, ఇల్లందు, నాగార్జున సాగర్‌, ఉప్పల్‌, అసిఫాబాద్‌, మహబూబాబాద్‌, బెల్లంపల్లి, మంథని, కొత్తగూడెం, వరంగల్‌ ఈస్ట్‌, మల్కాజిగిరి, కల్వకుర్తి, పెద్దపల్లి, రామగుండం, కంటోన్మెంట్‌, మానకొండూర్‌తో ఉమ్మడి ఖమ్మంలోని ఇంకొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత వస్తోందట. సర్వే చేయించినప్పటికీ ఫలితం లేకపోయిందట. దీంతో ఈ స్థానాల్లో టికెట్లు దక్కించుకున్న నేతలు టెన్షన్‌ పడుతున్నారట. అయితే ఇప్పటికే ఆయా స్థానాల్లో ఎవరిని నియమిస్తే బాగుంటుందని కేటీఆర్‌ టీమ్‌ రంగంలోకి ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తోందట. దీంతో టికెట్లు ఆశించిన, సిట్టింగుల్లో ఆశలు చిగురిస్తున్నాయట. ఫైనల్‌గా ఏం జరుగుతుందో.. ఎన్నెన్ని మార్పులు, చేర్పులు జరుగుతాయో..? అసలు ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే కేటీఆర్‌ వచ్చినంత వరకూ వేచి చూడాల్సిందే మరి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....