వచ్చే నెల నుంచి హైదరాబాద్‌ రోడ్లపై విద్యుత్‌ BUSES

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 (ఇయ్యాల తెలంగాణ );తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే న్యూస్‌ చెప్పింది. బస్సుల్లో నగదు రహిత ప్రయాణం చేసే వెసులుబాటు కల్పిస్తోంది. ముఖ్యంగా డిజిటల్‌ చెల్లింపులు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సహా ఆపైస్థాయి బస్సులు అన్నింట్లో ఐ`టిమ్స్‌ పరికరాలను అందుబాటులోకి తెస్తున్నారు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో పాటు ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి వాటితో చెల్లింపులు చేయొచ్చని చెబుతోంది. ఈమేరకు బండ్లగూడ బస్‌ డిపోను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. డిపోలోని ఆర్డినరీ, మెట్రో సహా మొత్తం 145 బస్సుల్లో ఐ`టిమ్స్‌ ను వాడేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం కంటోన్మెంట్‌ డిపోలో అమలు చేశాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,300 బస్సుల్లో దశలవారీగా ప్రవేశ పెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో టికెట్‌ తీసుకునేటప్పుడు చిల్లర సమస్యతో కండక్టర్లు, ప్రయాణికుల అనేక సమస్యలు వస్తుంటాయి. చిల్లర ఇవ్వమని కండక్టర్‌, లేవని ప్రయాణికులు గొడవలు పడిన సంఘటనలు కోకొల్లలు. అయితే ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టడానికి యాజమాన్య బట్‌ టికెట్లను రౌండ్‌ ఫిగర్లుగా మార్చింది. రూ.10, 15, 20, 25.. ఇలా రౌండ్‌ ఫిగర్‌ చేసేసింది. అయినప్పటికీ సమస్యలకు చెక్‌ పడలేదు. దీంతో దూర ప్రాంత, అధిక ఛార్జీలు ఉండే 700 బస్సుల్లో (సూపర్‌ లగ్జరీ, ఏసీ బస్సుల్లో) ఐ`టిమ్స్‌ ను ప్రవేశ పెట్టారు. మిగిలిన 8 వేల 300 బస్సుల్లో సాధారణ టిమ్స్‌ మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు వీటిల్లో కూడా నగదు రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చి.. ఇటు ఉద్యోగులతో పాటు ప్రయాణికుల సమస్యలను తీర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణలో ఆర్టీసీబసుల్లో ప్రయాణించే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. బస్సుల్లో ఫ్రీ వైఫై సదుపాయం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్టు ఆర్టీసీఎండీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు. గ్రేటర్‌ జోన్‌ పరిధిలో వచ్చే నెల నుంచి విద్యుత్‌ బస్సులను నడిపాలని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కొత్తగా వచ్చే విద్యుత్‌ బస్సులను నగరంలో ఏయే మార్గాల్లో నడపాలనే దానిపై ఆర్టీసీ అధికారులు ఆన్‌ లైన్‌ సర్వే చేస్తున్నారు. ముఖ్యంగా ఏ మార్గంలో విద్యుత్‌ బస్సులు నడిపితే ఆక్యుపెన్సీ పెరుగుతుంది, పాత మార్గాల్లోనే వీటిని నడపాలా లేదా కొత్త మార్గాలను ఎంపిక చేయాలా అని ఆలోచిస్తుంది. అంతేకాకుండా మెట్రో రైళ్లు ఉన్న మార్గాల్లో నడిపితే లాభం ఉంటుందా అనే దానిపై ప్రజల స్పందన కోరుతున్నారు. ఇందుకోసమే ఆన్‌ లైన్‌ లో సర్వే నిర్వహించి.. ఆపై నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఆరు నుంచి ఏడాదిలోగా దాదాపు వెయ్యికి పైగా విద్యుత్‌ బస్సులను నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఒలెక్ట్రా కంపెనీతో కూడా ఆర్టీసీ యాజమాన్యం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. నగరంలో నడిపించే విద్యుత్‌ బస్సులు నాన్‌ ఏసీగా ఉంటాయి. అందుకు సంబంధించిన నమూనా బస్సును ఇప్పటికే ఒలెక్ట్రా విడుదల చేసింది. అన్ని సక్రమంగా ఉంటే నగరంలో తొలి విడతగా 28 బస్సులను తీసుకురానున్నారు. నగరంలో వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు నగర ప్రజలకు ప్రాణవాయువు పెంచాలన్న లక్ష్యంతోనే ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సులను తీసుకు వస్తోంది. అయితే ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న కాలం చెల్లిన బస్సులను స్క్రాప్‌ కు పంపించి.. వాటి స్థానంలో విద్యుత్‌ బస్సులను ఏర్పాటు చేస్తోంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....