మహిళా రిజర్వేషన్‌ కోసం ఏకగ్రీవ తీర్మానం., కేంద్రాన్ని డిమాండు

హైదరాబాద్‌ సెప్టెంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ ): సమాజంలో సగభాగమైన మహిళలు అన్ని రంగాల్లో పురుషునితో సమానంగా రాణించినప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అధినేత సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశమైన బిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం పునరుద్ఘాటించింది.  మహిళల్లో దాగివున్న శక్తిని వెలికితీసి వారికి సహకరిస్తూ వారిని అభివృధ్ధిలో భాగస్వాములను చేసినపుడు మాత్రమే ఏ సమాజమైనా కూడా ప్రగతి పథంలో పయనిస్తుందనే వాస్తవాన్నిస్పష్టం చేసింది. ఈ దిశగా అభివృద్ధి చెందుతున్న దేశాలను  ప్రపంచవ్యాప్తంగా వున్న సోదాహరణలతో సహా విశ్లేషించింది.బిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయాల మేరకు పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు భారత ప్రధాని నరేంద్ర మోడీకి మహిళా రిజర్వేషన్ల పై లేఖ రాసారు. చట్ట సభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్‌ కోసం బిల్లును ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మొట్ట మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ( 14 జూన్‌ 2014) ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిన విషయాన్ని కేంద్రం ఇంతవరకు పట్టించుకోకపోవడం పై సంయుక్త సమావేశం అసంతృప్తిని వ్యక్తం చేసింది. మహిళాభ్యున్నతి పట్ల చిత్తశుద్దిని ప్రదర్శిస్తూ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండు చేస్తూ బిఆర్‌ఎస్‌ పార్టీ సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....