ఫ్రీ గిఫ్ట్‌ లతో నేతలు

 

కరీంనగర్‌, జూలై 24, (ఇయ్యాల తెలంగాణ ):రాజకీయాల్లో రాణించేందుకు సరికొత్త రాజకీయానికి శ్రీకారం చుడుతున్నారు నేతలు. సాధారణంగా రాజకీయాల్లో నాయకులు ప్రచారం చేసుకోవాలంటే ప్రసార మాధ్యమాలు, గోడపత్రికల ద్వారానో చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు తెలంగాణా రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్‌ మొదలైంది. పైన చెప్పినవే కాదు గోడ గడియారాలను సైతం ప్రచారానికి వాడుకుంటున్నారు. ఎన్నికల వేళ ఉచితాలు, కానుకలు ఇవ్వడం పరిపాటి కానీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా ఎన్నికల ప్రచార సమయాల్లో టీవీలు, కుట్టు మిషన్లు, గొడుగులు, గోడ గడియారాలు, గ్రైండర్లు పంచడం ఆనవాయితీగా ఉండేది. ఇప్పుడు ఈ తరహా సంస్కృతి తెలంగాణాలో ప్రాచుర్యం సంతరించుకుంటుంది.తెలంగాణాలో శుభకార్యాలకు వచ్చే వారికి ఆహ్వానితులు తమ స్థోమతకు తగ్గట్టు వారి కుటుంబ పండుగ గుర్తుండేలా చిరు బహుమతులు, శుభపత్రిక తోపాటు లేదా సదరు శుభాకార్యంలో ఇస్తుంటారు. అందులో భాగంగా కొంతమంది గోడ గడియారాలు సైతం బహుమతులుగా అందిస్తుంటారు. కానీ ఇలాంటి అవకాశాన్ని రాజకీయ నాయకులు తమ రాజకీయ అవసరాల కోసం ఇప్పుడు వాడుతుండడం విశేషం .

తెలంగాణ రాజకీయాల్లో గతంలో ఖమ్మంలో పువ్వాడ అజయ్‌ అతని ప్రత్యర్థి ఈ ట్రెండ్‌ ని ఫాలో అయ్యారు. ఉప ఎన్నికల వేళ మునుగోడు, హుజురాబాద్‌ లలో కూడా పొలిటికల్‌ గడియారాలు, ఫోటోలు కనిపించాయి. అలాగే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఓటర్లతో ఫోటోలు దిగి ఫ్రేమ్‌ కట్టించి పంపిణీ చేశాడు.ఇప్పుడు తాజాగా అదే ట్రెండ్‌ ను మంత్రి జగదీశ్‌ రెడ్డి కూడా ఫాలో అవుతున్నారు. సూర్యాపేటలో ఏ ఇంట్లో చూసినా జగదీష్‌ రెడ్డి పొలిటికల్‌ గడియారాలు తళుక్కుమంటున్నాయి. సూర్యాపేట అభివృద్ధికి తాను చేసిన కృషిని ప్రతిబింబించేలా ఫోటోలు చేర్చి గోడగడియారాలను ఇంటింటికి అందిస్తున్నారు. సూర్యాపేటలో 2014 నుండి ఇప్పటి వరకు సుమారు పది వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. అందులో ప్రధానంగా మెడికల్‌ కాలేజీ, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, మినీ ట్యాంక్‌ బండ్‌, ఎస్పీ, కలెక్టర్‌ కార్యాలయాలు ల్యాండ్‌ మార్క్‌ పనులు కావడంతో ఆ ఫోటోల మధ్యలో తన ఫోటో చేర్చి గోడగడియారాలు పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఇంటికి తాను చేసిన అభివృద్ధి సందేశం కనపడేలా ప్రోజెక్ట్‌ చేసుకుంటున్నారు. ప్రజలు తాము గోడగడియారంలో సమయం చూసిన్నప్పుడల్లా తన అభివృద్ధి గుర్తుకు రావాలని తాను చేసిన అభివృద్ధిని మరవకుండా ఉండేలా ప్లాన్‌ చేశారు. సూర్యాపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న ప్రతి ఇంటికి ప్రతి గడప గడపకి గోడగడియారాలు అందించి ప్రతి సమయంలో తన అభివృద్ధి మంత్రం దర్శనమివ్వాలనే ఆకాంక్షతో మంత్రి జగదీష్‌ రెడ్డి ఈ కార్యక్రమం చేపట్టారు.రాజకీయాల్లో రాణించేందుకు తమని తాము ప్రోజెక్ట్‌ చేసుకుంటూ ప్రజల మన్ననలు పొంది ఎన్నికల్లో గెలిచేందుకు నాయకులు సరికొత్తగా ఈ పంథాను ఎంచు కుంటున్నారు. ప్రజలకు సమయాన్ని సూచించే ఈ రాజకీయ గడియారాలు పొలిటికల్‌ నాయకులకు ఎలాంటి లాభాన్ని చేకూరుస్తాయో వేచిచూడాలి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....