తెలంగాణ నుంచి మాజీ ఎంపీ రేణుకాచౌదరి, అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్
న్యూ డిల్లీ ఫిబ్రవరి 14 (ఇయ్యాల తెలంగాణ) : కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీలను బుధవారం నాడు ప్రకటించింది. తెలంగాణతో పాటు కర్ణాటక, మధ్యప్రదేశ్ జాబితాను కూడా కాంగ్రెస్ హై కమాండ్ విడుదల చేసింది. తెలంగాణ నుంచి మాజీ ఎంపీ రేణుకాచౌదరి, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ఖరారు చేసింది. అలాగే కర్ణాటక నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నాసీర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్లను నియమించింది. మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్లకు చోటు కల్పించింది.అయితే తెలంగాణ నుంచి రెండు స్థానాలను కూడా రాష్ట్రానికి చెందిన నేతలకు అవకాశం ఇవ్వాలని కేంద్ర కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ సభ్యుల విషయంలో అనూహ్యంగా అనిల్ కుమార్ యాదవ్ పేరు తెరపైకి వచ్చింది. యువతను ఆకట్టుకునే విషయంలో అనిల్కు కాంగ్రెస్ అధిష్ఠానం అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిసిన అనిల్ కుమార్ యాదవ్
తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా తనను ప్రకటించడంతో.. ఆ పార్టీ అధిష్ఠానానికి అనిల్ కుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. తన లాంటి యువకుడికి అధిష్ఠానం రాజ్యసభ అవకాశం ఇవ్వడం అనందంగా ఉందన్నారు. కష్టపడే వారికి కాంగ్రెస్లో పదవులు దక్కుతాయనడానికి ఇదే ఉదాహరణ అని చెప్పారు. తనకు పదవి ఇవ్వడం యూత్ కాంగ్రెస్ కార్యకర్తల కృషి అని తెలిపారు.వెంకట్కి ఎమ్మెల్సీ, తనకు రాజ్యసభ ఇవ్వడంతో కాంగ్రెస్ యువకులకు ఇస్తున్న ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చని అన్నారు. రాజ్యసభ అవకాశం ఇస్తారని తన జీవితంలో ఊహించలేదని చెప్పారు. కొత్త రక్తాన్ని రాజకీయాల్లోకి తేవడమే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ లక్ష్యమని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.