గజ్వేల్ జులై 5 (ఇయ్యాల తెలంగాణ ):దేశంలో రైతు రాజ్యం తెచ్చుకోవాలని భారాసతో కలిసి అడుగులేస్తూ ముందుకు కదిలిన మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల ప్రజలు మొన్నటి తెలంగాణ ఎన్నికల ఫలితాలతో తీవ్ర ఆవేదన చెందారని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ఖమ్మం, మహబూబాబాద్, వేములవాడ, నర్సాపూర్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల నుంచి తనను కలిసేందుకు వచ్చిన వారినుద్దేశించి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ప్రసంగించారు.తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే ఆదర్శంగా పాలన అందించిందని. విద్యుత్, సాగు, తాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో భారాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యాచరణ దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా కొనసాగిందని పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయ ప్రగతిని చూసి మహారాష్ట్ర వంటి పక్క రాష్ట్రాల ప్రజలు తమకూ కేసీఆర్ పాలన కావాలని కోరుకున్నారని తెలిపారు. కేసీఆర్ పాలన లేకపోవడం వల్ల తెలంగాణ రైతుల కంటే మహారాష్ట్రతో పాటు దేశ రైతాంగమే తీవ్రంగా నష్టపోయిందని ఇటీవల తనను కలిసిన మహారాష్ట్ర నేతలు అన్నారని భారాస అధినేత వివరించారు. భారాస ఓటమితో రైతురాజ్యాన్ని అందించగల కేసీఆర్ దార్శనిక నాయకత్వాన్ని దేశం కోల్పోయిందని బాధపడ్డారని తెలిపారు.
- Homepage
- Telangana News
- అనతి కాలంలోనే ఆదర్శ పాలన అందించాం KCR
అనతి కాలంలోనే ఆదర్శ పాలన అందించాం KCR
Leave a Comment