తిరుమల జులై 3, (ఇయ్యాల తెలంగాణ ):తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం ప్రారంభమైంది. అంతకుముందు శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి మఠంలో కలశ స్థాపన, కలశ పూజ, విష్వక్సేనారాధన, మేదినిపూజ, మృత్సంగ్రహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తరువాత సేకరించిన పుట్టమన్నుకు ప్రత్యేక పూజలు నిర్వహించి చాతుర్మాస సంకల్పం స్వీకరించారు. అనంతరం శ్రీ పెద్దజీయర్ స్వామి తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కనగల జీయంగారి మఠం వద్ద నుండి శ్రీ చిన్నజీయర్ స్వామి మరియు ఇతర శిష్యబృందంతో శ్రీవారి ఆలయానికి ఊరేగింపుగా బయల్దేరారు. తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ స్వామి పుష్కరిణి, శ్రీ వరాహస్వామివారిని దర్శించుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు. శ్రీవారి ఆలయ మహద్వారం వద్ద టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. శ్రీ జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత శ్రీ పెద్దజీయంగారికి మేల్చాట్ వస్త్రాన్ని, శ్రీ చిన్నజీయంగారికి నూలుచాట్ వస్త్రాన్ని బహూకరించారు. అనంతరం శ్రీపెద్దజీయర్ మఠంలో శ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీ చిన్నజీయర్స్వామి కలిసి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, విజిఓ బాల్ రెడ్డి, పేష్కర్ శ్రీహరిలను శాలువతో సన్మానించారు.