రైళ్లలో CC టీవీలు

ముంబై,  జూలై 14 (ఇయ్యాల తెలంగాణ) :  భారతీయ రైల్వే ప్రయాణికుల భద్రతను పెంపొందించే దిశగా ఒక అద్భుతమైన, సమగ్రమైన ప్రణాళికను ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా మొత్తం 74,000 ప్యాసింజర్‌ కోచ్‌లు, 15,000 సరుకు రవాణా లోకోమోటివ్‌లలో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ తాజాగా ప్రకటించింది. అయితే రైలు 100 కిలో విూటర్ల వేగంతో వెళ్తున్నా దృశ్యాలు అత్యంత నాణ్యంగా వచ్చేలా ఇవి పని చేయబోతున్నట్లు పేర్కొంది. ఈ బృహత్తర ప్రాజెక్ట్‌ ప్రయాణ అనుభవాన్ని మెరుగు పరచడమే కాకుండా రైళ్లలో జరిగే నేరాలకు అడ్డుకట్ట వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఈ సీసీటీవీల ఏర్పాటుకు ప్రధాన లక్ష్యం ప్రయాణికుల భద్రతను గణనీయంగా పెంచడం. రైళ్లలో జరిగే వస్తువుల దొంగతనాలను నియంత్రించడం. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని తక్షణమే గుర్తించి చర్యలు తీసుకోవడం. తద్వారా నేరాలను నివారించడం వంటి కీలక ఉద్దేశాలతో ఈ కెమెరాలను అమర్చుతున్నారు. రైల్వే అధికారులు ఈ చర్యల ద్వారా ప్రయాణికులు మరింత సురక్షితంగా, నిశ్చింతగా ప్రయాణించగలరని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ప్రతి ప్యాసింజర్‌ బోగీలో ప్రయాణికుల గోప్యతకు భంగం కలగకుండా, వారి కదలికలు ఎక్కువగా ఉండే ద్వారాల వద్ద మొత్తం 4 డోమ్‌ సీసీటీవీ కెమెరాలను అమర్చుతారు. 

అంటే ప్రతి ప్రవేశ మార్గం వద్ద రెండు కెమెరాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతి లోకోమోటివ్‌లో 6 సీసీటీవీ కెమెరాలను వ్యూహాత్మకంగా ఏర్పాటు చేస్తారు. లోకోమోటివ్‌ ముందు, వెనుక భాగాలలో ఒక్కో కెమెరా, కార్‌కు రెండు వైపులా డోమ్‌ టైప్‌ కెమెరాలతో పాటు, డ్రైవర్‌ క్యాబిన్‌లో డ్రైవర్‌ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి రెండు డెస్క్‌ మౌంటెడ్‌ మైక్రోఫోన్‌ కెమెరాలు కూడా ఉంటాయి. ఈ సీసీటీవీ కెమెరాలన్నీ అత్యాధునిక సాంకేతికతతో,  సర్టిఫికేషన్‌తో వస్తాయి. ఇది వాటి నాణ్యతకు హావిూ. రైలు గంటకు 100 కిలో విూటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నా లేదా తక్కువ కాంతి పరిస్థితుల్లో కూడా స్పష్టమైన చిత్రాలను, వీడియోలను రికార్డు చేయగల సామర్థ్యం వీటికి ఉంది.ఈ భారీ ప్రాజెక్టును అమలు చేయడానికి ముందు ఉత్తర రైల్వే విభాగంలో ఎంపిక చేసిన ప్యాసింజర్‌ బోగీలు, లోకోమోటివ్‌లలో ప్రయోగాత్మకంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి విజయవంతంగా పరీక్షించారు. సానుకూల ఫలితాల అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఈ విస్తృత ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. భవిష్యత్తులో సీసీటీవీ డేటాను విశ్లేషించడానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్సాంకేతికతను వినియోగించుకోవాలని కూడా రైల్వే మంత్రి సూచించారు. ఇండియా ఏఐ మిషన్‌ సహకారంతో ఈ కెమెరాల డేటాను విశ్లేషించి, అసాధారణ పరిస్థితులను గుర్తించి, భద్రతా చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ చర్యలన్నీ భారతీయ రైల్వేలను భద్రతలో ఒక అడుగు ముందుకు వేయిస్తాయని ఆశిస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....