RTC కి మరో 1325 బస్సులు….

హైదరాబాద్‌, జూలై  30, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థకు పెరుగుతున్న ప్రయాణికుల తాకిడి నేపథ్యంలో మరిన్ని బస్సు సర్వీసులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత కొన్నాళ్లుగా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకం తరువాత కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అధిక సంఖ్యలో మహిళలు ప్రయాణాలు సాగించడం, అదే సమయంలో పురుషులు, విద్యార్థులు, ఇతరులు సాగించే ప్రయాణాలకు అనుగుణంగా బస్సులు సరిపోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో బస్సుల్లో పెరిగిన రద్దీను తట్టుకునేందుకు అనుగుణంగా టీజీఎస్‌ఆర్టిసి కొత్త బస్‌ సర్వీసులను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.కొత్త బస్సులు కావాలన్న టీజీఎస్‌ఆర్టీసీ అభ్యర్థన మేరకు జూన్‌ నాటికి 1325 కొత్త బస్సులను దశలవారీగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. అయితే వీటిలో ఇప్పటి వరకు ఆర్టీసీకి చేరిన బస్సుల సంఖ్య అతి స్వల్పం. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని మరోసారి టీజీఎస్‌ఆర్టిసి నూతన బస్‌ సర్వీసులు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తి మేరకు కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం నూతన బస్సు సర్వీసులను అందించేందుకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వాన్ని అందించాలని కోరిన 1325 బస్సుల్లో 712 పల్లె వెలుగులు, 400 ఎక్స్ప్రెస్‌, 75 డీలక్స్‌, 138 లహరి, రాజధాని బస్సులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో ఇప్పటికే కొన్ని బస్సులు అందుబాటులోకి రాగా, మిగిలిన బస్సులు కొద్ది రోజుల్లోనే టీజీఎస్‌ఆర్టీసీ చేతికి అందం ఉన్నట్లు చెబుతున్నారు. వీటిలో కొన్ని బస్సులను మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి వినియోగించనున్నారు. గత కొద్ది నెలలుగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సంఖ్య గణనీయంగా పెరిగినట్లు టీజీఎస్‌ఆర్టిసి అధికారులు చెబుతున్నారు. 

ముఖ్యంగా హైదరాబాద్‌ నగర పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో ప్రతిరోజు వేలాదిమంది ప్రయాణాలు సాగిస్తున్నారు. బస్సుల సంఖ్య తక్కువగా ఉండడం ప్రయాణికులు సంఖ్య అధికంగా ఉండడంతో చాలామంది ప్రమాదకర స్థాయిలో ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ తరహా ప్రయాణాలు ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటికి చెక్‌ చెప్పేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు.నూతన ఆర్టీసీ బస్సులను అందించాల్సిందిగా ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నగర పరిధిలోనే కాకుండా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో బస్సులు కొరత వేధిస్తోంది. కొన్నిచోట్ల ఏళ్ల తరబడి వినియోగిస్తున్న బస్సులతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిని పక్కన పెట్టి కొత్త బస్సులను తీసుకువచ్చే ప్రతిపాదనను ఇప్పటికే టీజీఎస్‌ఆర్టిసి అధికారులు పెట్టారు. ఈ ప్రతిపాదనలను అధికారులు ఇప్పటివరకు అమలు చేయకపోవడంతో ప్రజా రవాణాలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదే సమయంలో గ్రావిూణ ప్రాంతాల్లోని అనేక జిల్లాల్లో ప్రజల రవాణాకు కీలకంగా వ్యవహరిస్తున్న పల్లె వెలుగు బస్సులు కూడా కొరత వేధిస్తోంది. కొన్నిచోట్ల డొక్కు బస్సులతోనే ప్రజలకు సేవలను అందించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఇబ్బందులను కూడా టీజీఎస్‌ఆర్టిసి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నూతన బస్సులను కొద్ది రోజుల్లోనే కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. తద్వారా తమ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకానికి మరిన్ని బస్సులను కేటాయించడంతోపాటు పల్లె వెలుగు, ఇతర సేవలకు సంబంధించిన బస్సులను భారీగా టీజీఎస్‌ఆర్టిసికి ప్రభుత్వం అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అన్ని అనుకూలిస్తే ఆగస్టులోనే ఈ బస్సులు ప్రజలకు సేవలు అందించే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే రాష్ట్రంలోని ప్రజా రవాణాను వినియోగించే ప్రజలకు ఎంతగానో మేలు చేకూరనుంది. వ్యయ ప్రయాసలకు ఓర్చి సాగించే ప్రయాణాలకు చెక్‌ చెప్పేందుకు ఆస్కారం ఏర్పడుతుందని పలువురు చెబుతున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఎన్ని రోజుల్లోగా ఈ నూతన బస్‌ సర్వీసులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తుందో. తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త బస్సులను కొన్నింటిని టీజీఎస్‌ఆర్టిసి కి అందించింది. కొద్దిరోజుల కిందట 100 బస్సులను ప్రారంభించిన ప్రభుత్వం.. ఈ ఏడాది మార్చిలో 16 ఏసి స్లీపర్‌ కోచ్‌ బస్సులను ప్రవేశపెట్టింది. వీటితోపాటు మారుపోని బస్సులను కూడా అధికారులు టీజీఎస్‌ఆర్టిసికి అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....