జగిత్యాల, డిసెంబర్ 12 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు కూడా వచ్చేశాయి. డిసెంబర్ 11 గురువారం తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించగా.. అర్థరాత్రి 2 గంటల వరకు ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో చిత్ర విచిత్ర సంఘటనలు వెలుగు చూశాయి. వీటిలో ఓ చోట మాత్రం రసవత్తర పోరు జరిగింది. కారణం అక్కడ తల్లి, కుమార్తెలు ఇద్దరు బరిలో నిలవగా.. కుమార్తె విజయం సాధించింది.అసలు మ్యాటర్ అది కాదు ఇక్కడ. సదరు కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని.. తల్లిదండ్రులు ఆమెను ఇంటి నుంచి పంపేశారు. కొన్నాళ్లుగా మాట్లాడటం లేదు. అలాంటిది తల్లి, కుమార్తె ఇద్దరు సర్పంచి పదవికి పోటీ పడటం ఆసక్తికరంగా మారగా.. చివరకు పంచాయతీలో కూడా ప్రేమే విజయం సాధించి.. కుమార్తె గెలిచింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో వెలుగు చూసింది. తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు తల్లి కూతుర్లు సర్పంచ్ పదవి కోసం పోటీ పడ్డారు. గ్రామానికి చెందిన పల్లెపు సుమలత ప్రేమ వివాహం చేసుకొని అదే ఊరిలో నివాసం ఉంటోంది. తల్లి శివరాత్రి గంగవ్వ కూడా అదే గ్రామంలో ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల కూతురుతో మాటలు లేవు. వీరి గ్రామంలో సర్పంచ్ పదవికి బీసీ మహిళ రిజర్వేషన్ రాగా.. ఇద్దరు తల్లి కూతుర్లు బరిలో నిలిచారు. దాంతో, వీరిద్దరి మధ్య ప్రచార పోరు హోరాహోరీగా నడిచింది.తనని గెలిపించాలని తల్లి, కూతుర్లు ఎవరికి వారే ప్రచారం నిర్వహించారు. చివరికి తల్లిపై కూతురు నెగ్గింది. 91 ఓట్ల మెజారిటీతో సుమలత తన తల్లిని ఓడిరచింది. తల్లి శివరాత్రి గంగవ్వ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి కాగా.. సుమలత కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి. తల్లి కూతురు మధ్య పోటీలో కూతురు విజయం సాధించడం ఆసక్తికరంగా మారింది. ఈ విజయంపై సుమలత మాట్లాడుతూ.. గ్రామానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని చెప్పుకొచ్చింది. ఇచ్చిన హావిూలు ఒక్కొక్కటిగా అమలు చేస్తానని తెలిపింది.
ఇదిలా ఉంటే.. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీ హవా చాటింది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో.. ఏకగ్రీవాలతో కలుపుకొని అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2,383 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు. ఒక్క సిద్దిపేట జిల్లాలో తప్ప.. మిగిలిన అన్ని ఏరియాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. అధికార పార్టీకి పలు చోట్ల గట్టిపోటీ ఇచ్చిన ప్రతిపక్ష బీఆర్ఎస్ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 1,146 స్థానాల్లో గెలుపొందింది. 455 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
