నల్గోండ, జూలై 10 (ఇయ్యాల తెలంగాణ) : ఒక్కోసారి పోలీసుల మందుకు వింత కేసులు వస్తాయి. వీటికి కూడా కేసు పెడతారా అంటూ పోలీసులే ఆశ్చర్యపోతుంటారు. ఇప్పుడు నకిరేకల్ పోలీసుల ముందుకు అటువంటి కేసే వచ్చింది. రోజురోజుకు పెరుగుతున్న క్రైమ్ రేట్తో పోలీసులు సతమతమవుతున్నారు. ముఖ్యంగా దొంగతనాలు, దోపిడీలు, హత్యలు వంటి కేసులతో వాళ్లు బిజీ బిజీగా ఉంటారు. ఈ కేసుల పరిష్కారానికి పోలీసులు నానా తంటాలు పడుతుండగా.. నల్లగొండ జిల్లా పోలీసులకు ఓ వింత కేసు ఎదురైంది. ఈ కేసును ఎలా పరిష్కరించాలో అర్థం కాక ఖాకీలు తలలు పట్టుకుంటున్నారు. ఆ వింత కేసు ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం గొల్లగూడెంకు చెందిన గంగమ్మ అనే వృద్ధురాలికి పెంపుడు కోడి ఉంది. ఆ కోడి ప్రతిరోజు ఆరు బయటకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వస్తుంది. గంగమ్మ ఇంటి పక్కనే ఉన్న రాకేష్ ఇంట్లోని గడ్డివాము వద్ద గింజలు తినేది. అయితే తన గడ్డివాములో గంగమ్మ కోడి గింజలు తింటుందనే ఆగ్రహంతో రాకేష్ కర్రతో కొట్టడంతో కోడి కాళ్లు విరిగిపోయాయి. తన కోడి కాళ్లు విరగొట్టిన రాకేష్పై కేసు నమోదు చేయాలంటూ గంగమ్మ బోరున విలపిస్తూ నకిరేకల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి గొడవలు సాధారణమే అంటూ కేసులు ఎందుకు..? కోడికి ఎంత రేటో చెప్పు.. రాకేశ్తో డబ్బులు ఇప్పిస్తామని పోలీసులు చెప్పారు.నా కళ్ళముందే నా కోడిని కర్రతో కొట్టి కాళ్లు విరగొట్టాడని.. నాకు డబ్బులు వద్దు ఏమి వద్దు రాకేష్కు శిక్ష పడాల్సిందేనంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నా కోడికి జరిగినట్లు ఊళ్లో ఏ కోడికి జరగకూడదు అని గంగమ్మ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. గంగమ్మకు సర్ది చెప్పేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా వినలేదు. దీంతో చేసేది ఏవిూ లేక నకిరేకల్ పోలీసులు.. గ్రామానికి వచ్చి పంచాయతీని పరిష్కరిస్తామని సర్ది చెప్పారు. ప్రస్తుతానికి ఇంటికి వెళ్లి కోడికి వైద్యం చేయించుకోమని చెప్పి గంగమ్మను పంపించేశారు. ఈ కోడి పంచాయితీనీ ఎలా పరిష్కరించాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.