హైదరాబాద్, జూలై 14 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్ పాతనగరంలో ఘటాల ఊరేగింపు జాతర అంగరంగ వైభవంగా కొనసాగింది. పాతనగరంలోని ప్రధాన దేవాలయాలకు సంబందించిన బోనాల వేడుకలకు ప్రతిష్టించాల్సిన ఘటాల ఏర్పాటు ప్రక్రియ ఆదివారం మొదలయ్యింది. ప్రతి ఏటా బోనాల వేడుకలకు వారం రోజుల ముందు ప్రధాన ఆలయాలకు సంబంధించి అమ్మ వారి ఘటాల ఏర్పాటుతో బోనాల పండుగ వేడుక మొదలవుతుంది. పాతనగరంలోని గ్రామదేవతలైన బంగారు మైసమ్మ, నల్ల పోశమ్మ, ముత్యాలమ్మ, సింహవాహిని,పోలేరమ్మ, ఈదమ్మ, మహంకాళి దేవాలయాల ఘటాల ప్రతిష్టాపన మొదలయ్యింది. ఇందులో భాగంగా ఉమ్మడి దేవాలయాల వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో వివిధ దేవాలయాలకు సంబంధించి ఆదివారం కుమ్మరి వృత్తిదారులు అమ్మవారి ఘటాలను నెత్తిమీద మోసుకుంటూ వచ్చారు.
ప్రతి ఏటా కుమ్మరి వృత్తి దారులు అమ్మవారి ఘటాలను తీసుకురావడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఈ సందర్భగా ఆదివారం నిర్వహించిన అమ్మవారి ఘటాల మహోత్సవం వైభవంగా జరిగింది. లాల్ దర్వాజా శ్రీ సింహ వాహిని మహాకాళి దేవాలయం, గౌలిపూర భారత్ మాత దేవాలయం, హరిబౌలి లోని శ్రీ అక్కన్న మాదన్న దేవాలయం, శ్రీ నల్లపోచమ్మ మహంకాళి దేవాలయం, శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం, హరిబోలి శ్రీ ముత్తాలమ్మ దేవాలయం, ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం, నల్ల పోచమ్మ దేవాలయం, ముగ్గురు బస్తి శ్రీ నల్ల పోచమ్మ దేవాలయం, మేకల బండ ఊర పోచమ్మ దేవాలయం, పూల్ బాగ్, సుల్తాన్ షాహీ ప్రాంతాలలోని అనేక దేవాలయాలకు సంబంధించి దేవాలయ ఘట్టాల మహోత్సవం కొనసాగింది. కుమ్మరి కులస్తులు అంతా కలసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అమ్మ వారి ఘటాలను ఉరేగింపుగా తీసుకు వచ్చి ఆయా ఆలయాలలో ప్రతిష్ట చేశారు. ఘటాల ఊరేగింపులో దారి పొడవునా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నీళ్ళతో అమ్మవారికి సాకలు పెట్టారు. అంగరంగ వైభవంగా ఏంతో ఉత్సాహంతో ఘటాలను దేవాలయాల వరకు చేర్చారు. ఈ కార్యక్రమలో వృత్తి దారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పేరోజి మహేశ్వర్ ప్రధాన కార్యదర్శి కొల్లూరు జ్ఞానేశ్వర్ కోశాధికారిగా గట్టు సుదర్శన్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.