
హైదరాబాద్, జూలై 20 (ఇయ్యాల తెలంగాణ) : భవ్యివాణి ఆషాఢ మాసంలో ప్రారంభమై శ్రావణమాసం దాకా గ్రామాలు, పట్టణాల్లో బోనాల జాతర్లు కొనసాగుతాయి.బోనాల సందర్భంగా ఏ గ్రామంలో చూసినా పచ్చటి మామిడి తోరణాలు, రంగులు, సున్నాలతో అలంకరించిన ఇంటి పరిసరాలు,బందువుల రాకతో ఇల్లిల్లూ కళకళలాడుతాయి. ముఖ్యంగా ఆదివారం,గురువారం బోనాలు తీస్తారు. ఈ రెండు రోజులు అమ్మవారికి ఇష్టమయిన రోజులు కావడంతో ఆయా రోజుల్లోనే పండుగను నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో గ్రామ దేవతలకు కొత్త మట్టి పాత్రలోని నయివేద్యం (బోనం) సిద్దం చేయాలి. ఇందుకోసం పండుగ రోజు తెల్లవారు జామునే మహిళలు భక్తి శ్రద్దలతో కొత్త పాత్రలు తెచ్చి నయివేద్యం వండుతారు.కట్టెల పొయ్యిమీదే బోనం వండాలని ఆచారం అనాదిగా వస్తున్నది. (ప్రస్తుతం కొందరికి అలాంటి సదుపాయాలు లేవు ) వండడం పూర్తయిన తరువాత కుండను శుభ్రం చేసి, పసుపు,కుంకుమ,సున్నం,పువ్వులు వేపకొమ్మలతో అలంకరించి దానిపైన దీపం వెలిగిస్తారు.మంగళ,బుధ వారాల్లోనూ బోనాలు సమర్పిస్తారు.
పండుగ గొప్పతనం…..!

ఆషాడ మాసంలో అమ్మవారికి బోనం సమర్పించడంతో పాటు ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో కలిసి భుజిస్తారు. ఊరు శివారులో ఉన్న ఆలయాలు అటవి ప్రాంతాల్లో సంబరాలు చేసుకుంటారు.శ్రావణంలో బోనాలు తీసేవారు కూరగాయలతోనే విందులు వినోదాలు నిర్వహించుకుంటారు.
ప్రత్యేక వేషధారణలు ……!

బోనాల పండుగ రోజున శివసత్తులు,పోతురాజులు సందడి చేస్తారు.బోనాల ఊరేగింపు ముందు విన్యాసా లు చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు.అమ్మవారికి బోనం సమర్పించే సమయంలో గ్రామానికి సంబంధిం చి, విస్తార వర్షాలు కురుస్తాయా సకాలంలో పంటలు పండుతాయా అన్న అంశాలపై భవ్యివాణి వినిపిస్తారు.
శాస్త్రీయ కోణంలో చూసినా…..!

శాస్త్రీయ కోణంలో చూసినా బోనాల ఉత్సవాల వలన అనేక ఉపయోగాలున్నాయి.వర్షాకాలంలోనే కొత్తనీరు చేరి,పారిశుధ్ధ సమస్యలతో వ్యాధులు ప్రబలే అవకాశ ముంటుంది.ఈ కాలంలోనే అమ్మవార్లకు బోనాల ఉత్సవా లు నిర్వహిస్తారు.నయివేద్యం తయారీకి పసుపు,బియ్యం వినియోగిస్తారు.బోనాన్ని అలంకరిం చేటప్పుడు పసుపు, సున్నం వాడతారు.ఇంటిని మామిడి తోరణాలు,వేప కొమ్మలతో అలంకరిస్తారు.సాకలోనూ వేపాకు వాడతారు. వేప,పసుపు విరివిగా ఉపయోగించిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వాటిలోని యాంటీ బయాటిక్స్తో రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. గడపలను పసుపుతో అలంకరించడం, మామిడి తోరణాలు కట్టడం మూలంగా క్రిములు,బ్యాక్టీరియా,ఇతర వయిరస్ ను ఇళ్ళలోకి రాకుండా చేస్తుంది.