Kareem Nagar గుడిలో దెయ్యం.!

కరీంనగర్‌, జూలై  15   (ఇయ్యాల తెలంగాణ) : గుళ్లో ఏముంటుంది..? అంటే దేవుడనే సమాధానమే వస్తుంది. కానీ, అక్కడ గుళ్లో మాత్రం ఏముంటుందో తెలిస్తే విూరు అవ్వాకైపోతారు. ఆ అంధవిశ్వాసమే.. ఇప్పుడా గుడికి ఎవ్వరినీ పోకుండా చేసేసింది. మరి భక్తుడికి, భగవంతుడికి అనుసంధానమైన పూజారి మరణంతో ఆ గుళ్లో ఏం జరిగింది..? అదంతా తెలుసుకోవాలంటే  ఈ స్టోరీ చదవాల్సిందే..గుడికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. కానీ ఆ గుడిలో అడుగుపెడితే కాళ్లు, చేతులు వణుకుతాయి. గుడి గంట మోగినా గుండె దడ పెరుగుతుంది. అరుపులు.. కేకలు.. పూనకంతో ఊగిపోయే జనాలు, వామ్మో.. ఒకటేమిటీ ఇంకా చాలానే కనిపిస్తాయి. ఆ ఆలయం ఎక్కడో లేదు మన తెలంగాణలోనే ఉంది.ఇదిగో మనం చూస్తున్న ఈ గుడి వాస్తవానికి వేణుగోపాలస్వామి ఆలయం. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండలో ఉన్న ఈ ఆలయ చరిత్ర 150 ఏళ్ల కిందిది. అయితే గత 15 ఏళ్ల నుంచి ఇక్కడ సరిగ్గా ఇక్కడి దేవుడు పూజలకు నోచుకోవడం లేదు. గుడిలో చాలా సంవత్సరాలు పనిచేసిన పూజారి మరణంతో ఈ గుళ్లో దేవుడు కాక ఏదో అదృశ్య శక్తి ఉన్నట్టు ప్రచారం జరగడంతో జనం ఈ గుడికి రావడానికే బెంబేలెత్తిపోతున్నారు.15 ఏళ్ల క్రితం హనుమంతు అనారోగ్యంతో మరణించడంతో ఇప్పుడు గుడి మూగబోయింది. అప్పటివరకు పెద్దఎత్తున భక్తులు, మానసిక రోగులు, వికలాంగులతో ఎప్పుడూ కళకళలాడిన గుళ్లో.. ఇప్పుడు భూత, ప్రేత, పిశాచాలు అవహించిందని స్థానికుల్లో భావన నెలకొంది. ఈ అపవాదు కూడా నాలుగు దిక్కులా పాకింది. ఇప్పుడు రాత్రి వేళ ఇక్కడికి స్థానికులు కన్నెత్తి చూడకపోగా.. పట్టపగలు సైతం ఇక్కడికి వెళ్లడానికి భయపడుతున్నారు.ప్రస్తుతం కరీంనగర్‌ శివార్లలోని తీగలగుట్టపల్లికి చెందిన ఓ పూజారి రెండు, మూడు నెలలకో సారి ఈ గుడికి వచ్చి దీపం పెడుతూ పోతుండగా.. మిగిలిన జనం మాత్రం ఆర్నకొండ వేణుగోపాలస్వామి ఆలయానికి రావాలంటేనే జంకుతున్నారు. ప్రస్తుతం దూప, దీప నైవేద్యాలూ చూస్తున్న పూజారి ఆరోగ్యం కూడా క్షీణించడంతో.. దేవుడున్న ఈ గుడి దెయ్యం పట్టిన ఓ బూత్‌ బంగ్లాలా స్థానికుల్లో ఒకింత ఆందోళన రేకెత్తిస్తూ భయపెడుతోంది. రాక్షసులను చీల్చీ చెండాడిన కాళికామాతతో పాటు.. అన్ని భయాలకు దీటైన అభయాంజనేయుడు కొలువై ఉన్నా ఈ గుళ్లోకి వెళ్లేందుకు ఇప్పుడు జనం జంకుతున్నారు.ఓ వైపు ప్రపంచం టెక్నాలజీ వైపు అడుగులేస్తూ ఉంటే.. ఇదిగో దేవుడున్న గుళ్లో దెయ్యం ఉందనుకుంటూ జనం ఇంకా భయపడటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి జనవిజ్ఞాన వేదిక సభ్యులేమైపోయారో.. గుళ్లో దెయ్యమన్నన భయంతో భక్తజనం బంద్‌ అయితే నచ్చజెప్పాల్సిన పండితులేమయ్యారో తెలియడం లేదు. ఏదీ ఏమైనా గుళ్లో దెయ్యమన్న పేరుతో ఆర్నకొండ వేణుగోపాలస్వామి ఆలయం పాడుబడిపోవడం విచారకరం.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....