డాన్ హైస్కూల్లో సైబర్ క్రైమ్ పోలీసుల బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
హైదరాబాద్, జూలై 23 (ఇయ్యాల తెలంగాణ) : సైబర్ మాసాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సైబర్ క్రైమ్ సౌత్ జోన్ ఎస్ఐ భిక్షం అభిప్రాయం వ్యక్తం చేశారు. పురానీహవేలీ లోని డాన్ హైస్కూల్లో సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సబ్ ఇన్స్పెక్టర్ జీ. భిక్షం అధ్యక్షత వహించగా, కానిస్టేబుల్ సంయుక్త ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆన్లైన్ గేమ్స్, వర్క్ ఫ్రం హోం ఆఫర్లు, డిజిటల్ అరెస్ట్ లాంటి నకిలీ స్కామ్ల ద్వారా అమాయకులను మోసగాళ్లు లక్ష్యంగా పెట్టుకొని మోసాలకు పాల్పడుతున్నారని సూచించారు. సైబర్ మోసాల బారిన పడినవారు వెంటనే టోల్ఫ్రీ నెంబర్ 1930కు ఫోన్ చేయాలని, కాగా ఈ టోల్ ఫ్రీ నెంబర్ను ప్రతి విద్యార్థి గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ విషయమై పోలీసులకు వెంటనే సమాచారం అందిస్తే డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. సైబర్ ట్రాఫిక్ గురికాకుండా ఉండేందుకు ప్రధానంగా విద్యార్థినులు కొన్ని ముఖ్యమైన సూచనలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ రిసీవ్ చేయవద్దని సూచించారు. వాట్సప్, సోషల్ మీడియాలో అనుమానాస్పద లింకులు, మెసేజ్లపై కూడా క్లిక్ చేయొద్దని, తెలియని వ్యక్తులతో స్నేహం పెంచుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో డాన్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఆశు ఖన్నా, అడ్మినిస్ట్రేటర్ నర్జిస్, షజీయుల్లా ఫిరాసత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సైబర్ క్రైమ్ కు సంబంధించి విద్యార్థినులు అడిగిన పలు ప్రశ్నలు, సందేహాలకు పోలీసులు సమాధానాలు ఇచ్చారు.