నెక్స్ట్ ఏంటీ…?
హైదరాబాద్, ఫిబ్రవరి 05 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించడంతో ఈ కేసులో ప్రధాన అంకం ముగిసింది. తర్వాత సిట్ ఏమి చేయబోతోందన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ సిట్ కు అసలు సవాల్ ఇప్పుడే ప్రారంభమైందన్న భావన వినిపిస్తోంది. ఆదివారం కేసీఆర్ నివాసంలో సుమారు ఐదు గంటల పాటు సాగిన సిట్ విచారణ ఈ కేసులో కీలక మలుపు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తన ప్రభుత్వానికి తెలియకుండానే జరిగిందని, చట్టబద్ధమైన నిఘాకు, అక్రమ ట్యాపింగ్కు తేడా ఉందని కేసీఆర్ వాదించినట్లు తెలుస్తోంది. అయితే, సిట్ అధికారులు ఆయన ముందు ఉంచిన సాంకేతిక ఆధారాలు ఈ కేసును మరింత ఆసక్తికరంగా మార్చినట్లుగా చెబుతున్నారు. ముఖ్యంగా ప్రభాకర్ రావు వంటి అధికారుల పునర్నియామకం , రాజకీయ నేతలతో పాటు న్యాయమూర్తులు, వ్యాపారులు.. హరీష్ రావు ఫోన్లు ట్యాప్ చేయడంపై అధికారులు సంధించిన ప్రశ్నలకు సంధించినట్లుగా చెబు?తున్నారు.
ఈ కేసు కేవలం రాజకీయ నిఘాకే పరిమితం కాలేదనేది సిట్ అధికారుల ప్రధాన ఆరోపణ. ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఆసరాగా చేసుకుని కొందరు పారిశ్రామిక వేత్తలను భయపెట్టి భారీగా వసూళ్లకు పాల్పడ్డారని, ఇందులో ఒక పోలీస్ మాఫియా పనిచేసిందని దర్యాప్తులో వెల్లడైంది. బీఆరఎస్ పార్టీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్ల విరాళాలకు, ఈ ట్యాపింగ్ బెదిరింపులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో సిట్ ఆరా తీస్తోంది. రాజకీయ అధికారాన్ని ఉపయోగించి వ్యక్తిగత గోప్యతను హరించడమే కాకుండా, దాన్ని ధనార్జనకు వాడుకోవడం ఈ కేసులో అత్యంత తీవ్రమైన అంశం. దర్యాప్తు అధికారుల ముందున్న అతిపెద్ద సవాల్.. ధ్వంసమైన ఆధారాలను పునరుద్ధరించడం. నిందితులు హార్డ్ డిస్క్లను మూసీ నదిలో పడేయడం, కీలక డేటాను డిలీట్ చేయడం ద్వారా కుట్రను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని ఇప్పటికే గుర్తించారు. తాజాగా అందిన ఫోరెన్సిక్ నివేదికలు. క్లౌడ్ డేటా రికవరీ ద్వారా సిట్ కొన్ని కీలక ఫైళ్లను వెలికి తీసినట్లుగా చెబుతున్నారు. ఈ సాంకేతిక ఆధారాలను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి నేతల వాంగ్మూలాలతో సరిపోల్చి పక్కాగా చార్జిషీట్ రూపొందించాలని సిట్ భావిస్తోంది.న్యాయస్థానంలో కేవలం నిందితులు లేదా సాక్షుల వాంగ్మూలాలు నిలబడవు. టెలిగ్రాఫ్ చట్టం, టీ చట్టాల ప్రకారం నిబంధనలు ఎలా ఉల్లంఘించారో శాస్తీయంగా నిరూపించాల్సి ఉంటుంది. ఎవరి అనుమతితో ట్యాపింగ్ జరిగింది.. అనుమతి లేని నంబర్లను ఎందుకు మానిటర్ చేశారు అనే ప్రశ్నలకు సిట్ ఇచ్చే సమాధానాలే ఈ కేసు భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. ఇప్పటికే ఆరుగురు అధికారులపై మొదటి చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు, ఇప్పుడు కుట్ర’ కోణంలో సప్లిమెంటరీ చార్జిషీట్ వేయనున్నారు. ఇందులో కేసీఆర్ పేరును నిందితుడు గా చేరుస్తారా లేక సాక్షి గా ఉంచుతారా అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ నేరపూరిత కుట్రలో ఆయన ప్రమేయం ఉందని ఆధారాలు దొరికితే, అరెస్టుల పర్వం మళ్లీ మొదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
