Ticker

6/recent/ticker-posts

Ad Code

May 11 నుండి 13వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు !


తిరుపతి, ఏప్రీల్ 26 (ఇయ్యాల తెలంగాణ) : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 11 నుండి 13వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు  వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం మే 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.150/` చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు.

ఉత్సవాల్లో భాగంగా మే 12వ తేదీ ఉదయం 9.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించ నున్నారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.  

మే 6 న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

  శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక వసంత్సోవాలను పురస్కరించుకుని మే 6వ తేదీ ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.  ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించ నున్నారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు.  నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 9 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.  ఈ ఉత్సవాల కారణంగా మే 6 మరియు మే 10 నుండి 13వ తేదీ వరకు కల్యాణోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు