విశాఖపట్టణం,, ఏప్రిల్ 25, (ఇయ్యాల తెలంగాణ) : జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళి అంత్యక్రియలు ముగిశాయి. విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ హిందూ శ్మశాన వాటికలో చంద్రమౌళి అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. చంద్రమౌళి అంత్యక్రియలో మంత్రులు, కూటమి నేతలు, వైసీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రమౌళి అంతిమ సంస్కారాలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరై వీడ్కోలు పలికారు.చంద్రమౌళి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.అంతకుముందు శుక్రవారం ఉదయం పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళి నివాసానికి హోం మంత్రి వంగలపూడి అనిత చేరుకున్నారు. జమ్మూకాశ్మీర్ పర్యటనకు వెళ్లి ఉగ్రవాదుల తూటాలకు బలైపోయిన చంద్రమౌళి పార్థివదేహానికి నివాళులర్పించారు. చంద్రమౌళి సతీమణి నాగమణిని హోం మంత్రి అనిత ఓదార్చారు. అనంతరం ఇంటి నుంచి మొదలైన చంద్రమౌళి అంత్యక్రియలో పాల్గొన్నారు. పెదవాల్తేరు: ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళి కుటుంబాన్ని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి పరామర్శించారు.
పాండురంగాపురంలోని చంద్రమౌళి నివాసానికి వెళ్లిన ఆయన.. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రూ.10లక్షల పరిహారం చెక్కును చంద్రమౌళి కుటుంబసభ్యులకు అందజేశారు. అందమైన కాశ్మీర్ లోయలో జరిగిన ఉగ్రదాడి దేశం మొత్తాన్ని విషాదంలో నింపిందన్నారు. ఈ ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు సహా 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం అన్నారు. పహల్గాం ఉగ్ర దాడిని నిరసిస్తూ, ఆ దాడిలో మృతులకి సంతాపంగా జనసేన పార్టీ అధ్యక్షులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం ఉదయం విజయవాడలో మానవ హారం కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు రోడ్డులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఆయనతో పాటు పార్టీ నేతలు సామినేని ఉదయ భాను, అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్, అక్కల గాంధీ, రావి సౌజన్య, మల్లెపు విజయ లక్ష్మి తదితరులు సైతం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిరచారు. పాక్ చర్యలకు భారత ప్రభుత్వం తగిన రీతిలో బుద్ధి చెబుతుందన్నారు.
0 కామెంట్లు