హైదరాబాద్, మార్చి 2, (
ఇయ్యాల తెలంగాణ) : మట్టి పాత్రలు అంటే మన పూర్వీకుల కాలంలో వాడేవాళ్లు. ఇంకా చెప్పాలంటే రెండు తరాల కిందటి వరకు వాటిని బాగానే వినియోగించారు. మంచినీళ్లు తాగే కుండల నుండి వంట పాత్రల వరకూ అన్ని మట్టితో చేసినవే ఉండేవి. వాటిని వాడితేనే ఆరోగ్యం. అందుకే పెద్దలు మట్టి పాత్రలలో చేసే వంటలను ఇష్టంగా తినేవారు. తరువాత రోజుల్లో పరిస్దితులు మారిపోయాయి. కాలక్రమంలో మట్టి పాత్రలు కనుమరుగైయ్యాయి. ఎంతలా అంటే అప్పట్లో ఉండేవి ఇవి అనేలా పరిస్దితులు వచ్చాయి.కానీ నేటి రోజుల్లో సీన్ రివర్స్ అయ్యింది.మనం మట్టి నుండే వచ్చాం.. ఆ మట్టి నుండే మనుగడ నేర్చుకున్నాం.. దాన్ని మరిచినా భేషుగ్గా బ్రతకగలం అనుకున్నాం. కానీ కాలం గిర్రున తిరిగి మళ్లీ మట్టిని మన వంటింటికి చేర్చింది. విద్యుత్ కుక్కర్లు, నాన్స్టిక్ ప్యాన్లు, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు ..ఇలా ఆర్టిఫిషియల్ రోజులకి గుడ్బై చెబుతూ... మట్టి పాత్రల్లో వంట చేసుకొని ఆహా ఏమి రుచి అనే రోజులొచ్చాసాయి. మన తాతల కాలమంతా మట్టి చుట్టే తిరిగింది. పంటల నుంచి వంటల దాకా...అంతా అప్పట్లో మట్టిని నమ్ముకునే జీవనం సాగించారు. అయితే కాలక్రమంలో మనిషి కొత్త ‘పాత్ర’ల్లోకి మళ్లాడు. దాదాపుగా మట్టి పాత్రల్లో వంట అనేది మరిచిపోయాడు.కానీ ఇప్పుడు పరిస్థితుల్లో ఊహించని మార్పులొచ్చాయి. కోవిడ్ తరువాత ఆరోగ్యంపై పెరిగిన అవగాహన, సోషల్ విూడియా ప్రభావం పుణ్యమా అని మళ్లీ మట్టికి జీవం వచ్చింది. సహజమైన జీవన విధానం ద్వారా కలిగే లాభాలు అర్థం చేసుకున్న కొందరు మళ్లీ పాత రోజుల్ని గుర్తు చేస్తున్నారు. మట్టి పాత్రలనగానే కుండలు తప్ప మరేం గుర్తుకు రావు. కానీ మారుతున్న ఆలోచనా ధోరణులకు అనుగుణంగా మట్టితో చేసిన అన్ని రకాల వంట పాత్రలు ఇప్పడు హైదరాబాద్ వంటి హైటెక్ నగరాలలో సైతం దొరుకుతున్నాయి. మట్టితో తయారు చేసిన కుక్కర్లు, కడాయిలు, ప్యాన్లు, జగ్గులు, గ్లాసులు, కప్లు.. ఇలా ఒకటేమిటి వంటింటి సామాన్లన్నీ ఇప్పుడు ఈజీగా దొరుకుతున్నాయి. ఆన్లైన్లోనూ ఈ పాత్రల అమ్మకాలు జోరుగా సాగుతుండం కూడా మరో హైలెట్ గా చెప్పవచ్చు.సిటీలో సహజ పద్ధతులంటే ఖర్చుతో కూడిన వ్యవహారమనే ఆలోచన ముందుగా కలుగుతుంది.

కానీ మట్టి పాత్రల విషయంలో అలా కాదు. అదుబాటు ధరలలోనే మట్టి పాత్రలు దొరికేస్తన్నాయి. ఈ పాత్రలతో కాలుష్యం ఉత్పన్నం కాదు. మెటల్తో పోలిస్తే వీటిలో ఆహారం మెల్లిగా, సమంగా ఉడుకుతుంది. మట్టికి సహజంగా హీలింగ్ ఎనర్జీ ఉంటుంది. మన మూడ్ని దానంతట అదే మార్చే గుణం మట్టికి ఉందని మరోవైపు పరిశోధనల్లో తేలింది. మనం డిప్రెస్డ్గా ఉన్నప్పుడు మట్టికి దగ్గరగా చేసే ఏ పనైనా మూడ్ని ఇట్టే మార్చేయటం గమనించొచ్చు. అంతెందుకు ఇప్పుడు ప్రకృతి వైద్య విధానాల్లోనూ మట్టి వినియోగం ప్రాధాన్యత తెలిసిందే. మట్టి పాత్రల్లో వంటే కాదు.. అందులో ఆహారం తినడం, కాఫీ తాగడం కూడా రుచిగా, కొత్తగా ఉంటుంది అంటున్నారు ఈ పాత్రలు అలవాటైన వాళ్లు.ఇప్పుడు మార్కెట్లో నల్ల, టెర్రకోట మట్టి పాత్రలు లభిస్తున్నాయి. వీటిలో క్షార గుణం ఉండటం వల్ల ఆహారానికి కొత్త, ఇంపైన రుచి వస్తుంది. బొమ్మిడాయిల కూర రాత్రి మట్టి పాత్రలో వండి మరుసటి రోజూ తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుందని నాన్ ప్రియులు చెబుతున్నారు. మట్టి పాత్రల్లో పులుసు, పప్పు, మాంసాహారం ఇలా ఏది వండినా రుచి, వాసన రెట్టింపవుతుంది. పైగా నూనె ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. వీటి వాడకంలో కొంత జాగ్రత్త అవసరం. అలాగే ఈ పాత్రలను శుభ్రం చేయడానికి డిటర్జెంట్లు వాడకూడదు. నిమ్మకాయ, చింతపండు, వేడి నీళ్లు, కొబ్బరి పీచులతో క్లీన్ చేయాలి. పాత్రలు వేడిగా ఉన్నప్పుడు శుభ్రం చేసినా, ఆదరాబాదరాగా వాడిన పగిలి పోయే ప్రమాదం ఉంది. ఇలా జాగ్రత్తగా వాడితే మట్టిన మంచిన ఆరోగ్యం లేదు.అందుకే నెమ్మదిగా మట్టి పాత్రలకు అలవాటు పడుతున్నారు ప్రజలు. అవగాహనా పెరగడంతో రోజురోజుకూ వీటి వాడకం పెరుగుతోంది.
0 కామెంట్లు