సేవాలాల్ మహారాజ్ దేవత మేరామయాడికి సేవకుడిగా ఆమెకే షరతులు విధించి సాధించుకున్న భక్తుడు. బంజారాల ఉన్నతి కోసం కృషి చేశారు. తమను హింస పెడుతున్న బ్రిటిష్ వారితో పోరాడి జాతి పునర్నిర్మాణానికి కృషి చేశారు. సేవాలాల్ మహారాజ్ అనంతపూర్ జిల్లా గుత్తి మండలంలోని చెర్లోపల్లి గ్రామపంచాయతీ రంజీనాయక్ తండాలో భీమానాయక్, ధర్మాణిబాయి దంపతులకు 1739 ఫిబ్రవరి 15వ తేదీన జన్మించారు. రాథోడ్ వంశానికి చెందినవారు. భీమానాయక్ కు నలుగురు కుమారులు సేవాలాల్, హప, బాదు, బాణ, సేవాలాల్ మొదటి వారు. పుట్టుకతోనే మహా జ్ఞానిగా ఉన్నారు. చిన్నతనంలోనే సకల విద్యలను అభ్యసించారు. ఎవరికి కష్టం వచ్చినా వారి సమస్యలను పరిష్కరించేవారు. ఒకరోజు మేరామయాడి కలలో దర్శనమిచ్చి సేవాలాల్ ను భగత్ గా మారాలని సూచించింది. తాను మద్యం ముట్టనని, మాంసం తిననని రక్తతర్పణ చేయలేననీ, మద్యాన్ని నైవేద్యంగా ఇవ్వడం చేయలేనని సేవాలాల్ చెబుతారు. భక్తితో మాత్రమే పూజించగలనని విన్నవిస్తారు. దీంతో మేరామాయాడి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సేవాలాల్ కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతుంది. సేవాలాల్ చిన్న తమ్ముడు బాణాను, ఆంబోతును, గుర్రాలను, 3,755 పశువులను పూర్తిగా నాశనం చేస్తుంది. సేవాలాల్ కు ఒక పూట భోజనం కూడా కరవవుతుంది.సేవాలాల్ మేరామాయాడికి కొన్ని షరతులు పెట్టి తను భగత్ గా ఉంటానని మాట ఇస్తాడు. శాఖాహారిగా ఉంటూ మద్యం సేవించబోనని సేవకుడిగా మారుతాడు. మేరామాయాడి అనుగ్రహించి అతని తమ్మున్ని పునరుజ్జీవింజేసి, సంపదను తిరిగి ఇస్తుంది. మేరామాయాడికి సవత్సరానికి ఒక సారి కడవ్, చుర్మో, పిండి వంటలు నైవేద్యం సమర్పిస్తామని, జీవహింసను చేయబోమని చెబుతాడు.సేవాలాల్ తన చివరిదశలో యవాత్మల్ జిల్లా డిగ్రాస్ తాలూకాలోని రాయి అనే తాండలో నివసించారు. తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేసిన సేవాలాల్ 1806 ఏప్రిల్ 14న మహారాష్ట్రలోని బేరర్ అకొలా జిల్లాలకు డిగ్రాస్ నుంచి నాలుగు కిలోవిూటర్ల దూరంలో పౌర అనే గ్రామంలో నిర్యాణం చెందారు. ఆయన కుటుంబీకులు రెండు మందిరాలను నిర్మించారు. ఒకటి సేవాలాల్ మహారాజ్ కోసం, మరొకటి మేరామాయాడి కోసం. ఏటా ఫిబ్రవరి 15న అనంతపూర్ జిల్లా గుత్తి నియోజకవర్గంలో సేవాగఢ్, భోగ్ బండార్ నిర్వహిస్తారు.
0 కామెంట్లు