Ticker

6/recent/ticker-posts

Ad Code

కొత్త వ్యూహాలతో BRS... హీరోలను ఇంటర్వ్యూ చేయనున్న KTR

హైదరాబాద్‌, నవంబర్‌ 8, (ఇయ్యాల తెలంగాణ );ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే బహిరంగ సభలు, ర్యాలీలు, ఇంటింటి ప్రచారం. ఆ తర్వాత ప్రచార రథాలు, ఫ్లెక్సీలు, కరపత్రాలు, పోస్టర్లు ద్వారా ప్రజలను ఆకట్టుకునేవారు. అభ్యర్థులు వీధి వీధి తిరిగి ప్రజలను కలిసి తాము చేసిన అభివృద్ధిని వివరించేవారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ట్రెండ్‌ మారింది. వాయు వేగంతో సమాచారాన్ని ప్రజలకు చేరవేసేలా సోషల్‌ విూడియాను ప్రచార సాధనంగా మలుచుకుంటున్నారు. డిజిటల్‌ యుగంలో సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకేళ్లేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తుంటే, పదేళ్ల ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎండగడుతున్నాయి.తెలంగాణలో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ కొత్త వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఎన్నికల వేళ ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు సోషల్‌ విూడియా వేదికగా ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఎఫ్‌ఎం రేడియో టాక్‌ షోలు, తెలుగు సినీ నటులతో ఇంటర్వ్యూల నుంచి యూట్యూబ్‌ ద్వారా ఓటర్లను ఆకర్షించేందుకు రెడీ అయింది. మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ పార్టీ ప్రచారాన్ని సరికొత్తగా చేయాలని నిర్ణయించారు. మొన్న మై విలేజ్‌ షో ద్వారా కేటీఆర్‌ వీక్షకుల్ని ఆకట్టుకున్నారు. మై విలేజ్‌ టీంలో గంగవ్వతో సరదాగా ముచ్చటించారు. రుచికరమైన నాటుకోడి కూరని తయారు చేసి సదరు యూట్యూబర్స్‌ కి రుచి చూపించాడు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధి నుంచి ఉపాధి అవకాశాల కల్పన వరకు వివిధ అంశాలను వీక్షకులకు కేటీఆర్‌ వివరించారు. ఈ వీడియోకు యూట్యూబ్‌ సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. తెలంగాణలో ఎక్కడ చూసినా ఈ వీడియో గురించి చర్చ జరుగుతోంది.  మంత్రి కేటీఆర్‌ సెలబ్రెటీలను ఇంటర్వ్యూలు చేసేందుకు ప్లాన్‌ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌ లో ఇద్దరు ప్రముఖ తెలుగు హీరోలతో కేటీఆర్‌ ఇంటర్వ్యూల చేస్తే ప్రజల్లో మంచి రెస్పాన్స్‌ వస్తుందని ఆయన సోషల్‌ విూడియా టీం చెప్పడంతో కేటీఆర్‌ కూడా ఒకే చెప్పేసినట్లు సమాచారం. త్వరలో బుల్లితెరపైకి తీసుకొచ్చేలా వార్‌ రూంలోని సలహదారులు కసరత్తు చేస్తున్నారు. తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీలో, అందునా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోలనే కేటీఆర్‌ వినూత్నంగా ఇంటర్వ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంటర్వ్యూలు ప్రశ్నలు, తెలంగాణలో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న పథకాలపై వివరించేలా ఇంటర్వ్యూలు ఉండనున్నాయి. పోలింగ్‌ కు ముందు హీరోలతో కేటీఆర్‌ ఇంటర్వ్యూలను వదిలితే మంచి మైలేజ్‌ వస్తుందని బీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 120 సోషల్‌ విూడియా వార్‌రూమ్‌లలో 750 మంది సిబ్బంది పార్టీ కోసం కంటెంట్‌ను రూపొందించడంలో బిజీగా ఉన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి గొప్పగా చెబుతూనే,  ప్రత్యర్థులపై నెగటివ్‌ కంటెంట్‌ ను వ్యూహాత్మకంగా రూపొందిస్తున్నారు. 24 గంటలు టీవీ ఛానెల్స్‌, ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లలో కేటీఆర్‌ ఇంటర్వ్యూలతో ప్రచారం చేయబోతున్నారు. తద్వారా ప్రజలలో బీఆర్‌ఎస్‌ నినాదం మరింత లోతుగా వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్జే స్వాతి కేటీఆర్‌ విూద పాడిన పాట విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీలయినంత ఎక్కువగా జనాలను ఆకర్షించేలా బీఆర్‌ఎస్‌ వ్యూహాలు సిద్ధం చేస్తోంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు