హైదరాబాద్ నవంబర్ 1 (ఇయ్యాల తెలంగాణ ):మాజీ ఎంపి, సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజీనామా చేశారు. పార్టీ మేనిఫెస్టో కమిటీతో పాటు బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా లేఖను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. వివేక్ కొంతకాలంగా ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. బుధవారం ఉదయం ఆయనకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఫోన్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లు సమాచారం. కొన్ని రోజులుగా వివేక్ పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. అయితే, అలాంటిదేం లేదని ఆయన కొట్టిపారేస్తూ వస్తున్నారు. ఊహించని రీతిగా అయన తన రాజీనామా లేఖను పంపారు. బుధవారం నాడు అయన నోవా టెల్ హోటల్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలుసుకున్నారు.వివేక్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2009 లో పెద్దపెల్లి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ వచ్చాక 2014 ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత మరోమారు బీఆర్ఎస్ లో చేరిన వివేక్.. ఈ రోజు వరకు బీజేపీలో కొనసాగారు. చివరకు బుధవారం నాడు ఆయన తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించారు.
0 కామెంట్లు