కరీంనగర్ అక్టోబర్ 11 (ఇయ్యాల తెలంగాణ );బీఆర్ఎస్ మేనిఫెస్టోతో 2 సార్లు ప్రజల మైండ్ బ్లాంక్ అయ్యింది. ఈసారి బీఆర్ఎస్ మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు ఇవ్వబోతున్నరని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ ఈరోజు నిర్వహించిన విూడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలపై విరుచుకుపడ్డారు.. ఎన్నికల మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమంటూ ప్రగల్భాలు పలికిన కేసీఆర్ మేనిఫెస్టోలోని హావిూలను అమలు చేయకుండా చెత్తబుట్టకే పరిమితం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలకు సిగ్గు శరం ఉంటే... మేనిఫెస్టో హావిూలెందుకు అమలు చేయలేదో అమర వీరుల స్థూపం వద్దకు వచ్చి చర్చించేందుకు సిద్ధం కావాలంటూ సవాల్ విసిరారు. ఎన్నికల్లో మళ్లీ ఎలాగైనా గెలవాలని కుట్ర చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు తొత్తులుగా పనిచేసే వాళ్లకే పోస్టింగులిచ్చుకున్నారని చెప్పారు. అన్ని శాఖల అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం ఇంటెలిజెన్స్ అధికారులను ఎందుకు బదిలీ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వారంటీ లేని కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీలను నమ్మేదెవరని ప్రశ్నించారు. ఎంగిలి మెతుకులకు ఆశపడే నీచమైన పార్టీ ఎంఐఎం అని చెప్పిన బండి సంజయ్ ఆ పార్టీకి చీమునెత్తురుంటే తెలంగాణ అంతటా పోటీ చేయాలని సవాల్ విసిరారు.
0 కామెంట్లు