Ticker

6/recent/ticker-posts

Ad Code

BJP దుకూడు - సీనియర్లు దరఖాస్తు చేసుకోవాల్సిందే .. !


హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సవిూపిస్తుం డటంతో బీజేపీ దుకూడు పెంచింది. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థుల ప్రకటనకు ముందు ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మూడో రోజు దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలో ఆశావహుల నుంచి దరఖాస్తు స్వీకరణపై బీజేపీ అధిష్టానం ఆరా తీసింది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల లెక్కలను అడిగి తెలుసుకుంది. కీలక నేతల అప్లికేషన్లు కనిపించడకపోవడంతో హైకమాండ్‌ గుర్రుగా ఉంది. ఏ స్థాయి నేత అయినా అందరికీ ఒకటే రూల్‌ అని స్పష్టం చేసింది. ఇందులో ఎవరికీ మినహాయింపులు ఉండబోవని, ప్రతి ఒక్కరూ దరఖాస్తు సమర్పించాల్సిందేనని హుకూం జారీ చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు అయిన ఎంపీ లక్ష్మణ్‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, తదితరులంతా ఈనెల 9, 10 తేదీల్లో దరఖాస్తులు సమర్పించాలని ప్లాన్‌ చేసుకుంటున్నారు. హైకమాండ్‌ హుకుం జారీ చేయడంతో మంచి ముహూర్తం కోసమే తాము వేచి చూస్తున్నామని పలువురు కీలక నేతలు చెబుతున్నారు.ఈనెల 7వ తేదీన బీజీపీలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు 63 మంది 182 అప్లికేషన్లు సమర్పించారు. కాగా రెండో రోజు 178 దరఖాస్తులు వచ్చాయి. అందులో కీలక నేతలెవరివీ లేకపోవడాన్ని అధిష్టానం గుర్తించింది. కొంతమంది నేతలు మూడు, నాలుగు నియోజకవర్గాలకు దరఖాస్తు చేసుకున్నారు. మూడు రోజులు అప్లికేషన్లు భారీగానే వచ్చినా అష్టమి, నవమి కారణంగా 7, 8 తేదీల్లో అప్లికేషన్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 9, 10 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. 9న దశమి, 10వ తేదీన ఏకాదశి ఉన్న నేపథ్యంలో తొలుత వచ్చిన అప్లికేషన్ల కంటే భారీగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


ఈ రెండ్రోజుల్లోనే ముఖ్య నేతలు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అంబర్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్‌కు దరఖాస్తు చేసుకోనున్నారు. ఎంపీ లక్ష్మణ్‌ ముషీరాబాద్‌, డీకే అరుణ గద్వాల, ఈటల హుజురాబాద్‌, అర్వింద్‌ ఆర్మూర్‌, రఘునందన్‌ రావు దుబ్బాక, మాజీ ఎంపీ వివేక్‌ చెన్నూర్‌, జితేందర్‌ రెడ్డి మహబూబ్‌ నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి. కాగా విజయశాంతి, మురళీధర్‌ రావు, గరికపాటి మోహన్‌ రావు, చాడ సురేశ్‌ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఏ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి దరఖాస్తు చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ ప్రకాశ్‌ జవదేకర్‌.. మూడో రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోని అప్లికేషన్‌ సెంటర్‌ను పరిశీలించారు. అందరూ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని పార్టీ నేతలకు సూచనలు చేశారు.గతంలో ఎన్నడూ లేనివిధంగా దరఖాస్తు విధానానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. కాగా ఆశావహులకు ఈనెల 4వ తేదీ నుంచి ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ ఈనెల 12వ తేదీన భారత్‌ కు తిరిగిరానున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆప్టా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సమావేశాలకు ఆయన హాజరవుతున్నారు. ఈనెల 10వ తేదీన ఆయన అమెరికా నుంచి బయలుదేరి ఈనెల 12న భారత్‌ కు చేరుకుంటారు. ఈనేపథ్యంలో ఆయన దరఖాస్తును వేరొకరు అందజేసే అవకాశముంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు