Ticker

6/recent/ticker-posts

Ad Code

కేంద్ర బడ్జెట్ 2022-23 ను స్వాగతించిన BJP ఓబీసీ మోర్చా

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (ఇయ్యాల తెలంగాణ):  రాబోయే పాతికేళ్లలో భారత్‌ను అగ్రదేశంగా నిలపడమే లక్ష్యంగా  కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను నాలుగోసారి కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధాని గతిశక్తియోజన, సమీకృత అభివృద్ధి, అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు, పరిశ్రమలకు ఆర్థిక ఊతం అనే నాలుగు ప్రధాన అంశాల ఆధారంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌కు రూపకల్పన చేసారని స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్రకార్యవర్గ సభ్యులు యేచన్ సురేష్ మరియు తాళ్ల జైహింద్ గౌడ్ లు అన్నారు.  ఈ లక్ష్య సాధనలో భాగంగానే  మౌలిక వసతుల పై ఈ బడ్జెట్లో ప్రధానంగా దృష్టి సారించారని వారు అన్నారు.  2022-23 వార్షిక బడ్జెట్ యొక్క ఈ క్రింది ముఖ్యాంశాలను వారు ప్రస్తావించారు:  

2022-23 ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్‌ అంచనా రూ.39 లక్షల కోట్లని కాగా ద్రవ్యలోటు 6.9 శాతం అని, దాన్ని 2025-26 నాటికి 4.5 శాతానికి తగ్గించడం లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. రాష్ట్రాలకు ఆర్థికసాయంగా రూ.లక్ష కోట్లతో ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు.

జనవరిలో 2022 లో జీఎస్టీ వసూళ్లు దాదాపు  రూ.1. 41  కోట్లుగా నమోదవడం ఈ విధానం అమల్లోకి వచ్చాక ఇదే తొలిసారని, ఇది ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించిన కరోనా ఉధృతి నుండి త్వరగా కోలుకుంటున్న మన దేశ ఆర్థిక ప్రగతికి కొలమానంగా నిలుస్తుందని అన్నారు. 

క్రిప్టో కరెన్సీ వాడకం పట్ల దేశ  ప్రజలు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో డిజిటల్ రూపీని రిజర్వ్ బ్యాంక్ జారీ చేయనుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. 

వాణిజ్య రంగానికి ఊతమిచ్చే ఉద్దేశంతో దేశంలో నాలుగు చోట్ల మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పాదకతకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. “స్వస్థ భారత్” లో భాగంగా  దేశ ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సాహం అందించనున్నారు. 

ప్రకృతి వనరులను సంరక్షించే ఉద్దేశంతో నదుల అనుసంధానం పై కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందని, గంగా నుంచి కావేరీ వరకు దేశంలోని ఐదు ప్రధాన నదుల అనుసంధానం కోసం డీపీఆర్ పూర్తయ్యిందని తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రవహించే గోదావరి, కృష్ణా నదులు కీలక పాత్ర పోషించనున్నాయని, అయితే నదుల అనుసంధానానికి రాష్ట్రాలు అంగీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

అన్నదాతలకు చేయుతనందించడం కోసం గోధుమ, వరి సాగు చేసే రైతులకు కనీస మద్దతు ధర కోసం రూ.2.37 లక్షల కోట్లను ప్రత్యక్షంగా బదిలీ చేయనున్నట్లు, ఈ మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో చెల్లించనున్నామని   ప్రకటించారు. ఇంతే కాక ఖరీఫ్, రబీ సీజన్లలో వెయ్యి లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కేంద్రం సేకరించనుందన్నారు. 

దేశవ్యాప్తంగా భూ వివాదాలకు తెరదించడానికి ప్రతి స్థలానికి ఇక నుంచి 14 అంకెల యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్‌ను క్రియేట్ చేసేలా రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించనుంది. అంతే కాకుండా “వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్” సాఫ్ట్‌వేర్ ద్వారా దేశంలో ఎక్కడైనా డీడ్స్, డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా వ్యవస్థను రూపొందించనున్నామని తెలిపారు.

పీఎం ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదల కోసం 80 లక్షల ఇళ్లను నిర్మాణం చేపట్టనున్నట్లు ఇందుకు గాను బడ్జెట్‌లో 48 వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. 

ఇమిగ్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయడం కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో చిప్ ఆధారిత ఇ-పాస్‌పోర్టులను అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు దీని వాళ్ళ అంతర్జాతీయ ప్రయాణం చేసే వారికి ఈ తరహా పాస్‌పోర్టులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. 

బ్యాంకింగ్ కార్యకలాపాలను మరింత సౌకర్యవంతంగా మార్చడానికి దేశంలోని అన్ని ఫోస్టాఫీసుల్లోనూ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెస్తామని, పోస్టాఫీసుల ద్వారా ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలను పొందొచ్చని తెలిపారు.

వచ్చే మూడేళ్లలో 400 న్యూ జనరేషన్ “వందే భారత్” రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 

కోవిడ్ ప్రభావంతో గత రెండేళ్లుగా తీవ్రంగా నష్టపోయిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని “ప్రధాని ఈ-విద్య” కార్యక్రమం కింద ప్రస్తుతం ఉన్న 12 డిజిటల్ ఎడ్యుకేషన్ టెలివిజన్ ఛానెళ్లను 200కు పెంచనున్నారు. 

జాతీయ రహదారుల నెట్ వర్క్‌ను 25 వేల కిలోమీటర్లకు పెంచనున్నారు.  

దేశ ప్రజల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ కోసం నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రాంను ప్రారంభించనున్నారు.

దేశేయ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఇమిటేషన్ జ్యుయలరీపై దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్లు తెలిపారు.

కార్పొరేట్ సర్‌ఛార్జీని 17 శాతం నుంచి 7 శాతానికి తగ్గించనున్నారు.

టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ ఆధునీకరణలో భాగంగా  2022-23లోనే 5జీ స్పెక్ట్రం వేలాన్ని నిర్వహించనున్నారు.

పీఎల్ఐ పథకం కింద సోలార్ మాడ్యుల్స్ కోసం రూ.19,500 కోట్లు కేటాయించారు.

ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్‌ను మార్చి 2023 వరకు పొడిగించారు.

డేటా సెంటర్, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌లకు ఇన్‌‌ఫ్రా‌స్ట్రక్చర్ హోదా ఇవ్వనున్నారు.

స్పెషల్ ఎకనమిక్ జోన్స్ యాక్ట్‌  లో ఉన్న లోటుపాట్లను సవరిస్తూ మరింత సమర్థవంతంగా నిర్ధారిత లక్ష్యాలను సాధించేలా ప్రస్తుత చట్టం స్థానంలో నూతన చట్టాన్ని తీసుకురానున్నారు.

ఐదు విద్యాసంస్థలను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ప్రకటించనున్నారు. తద్వారా ఆయా విద్యాసంస్థలకు రూ.250 కోట్ల చొప్పున నిధులు అందనున్నాయి.

75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ సెంటర్లను ప్రారంభించనున్నారు.

2 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు.

రోడ్లు, రైల్వే, ఎయిర్‌పోర్టులు, నౌకాశ్రయాలు, మాస్ ట్రాన్స్‌పోర్ట్, జల మార్గాలు, లాజిస్టిక్ ఇన్‌ఫ్రా‌లను పీఎం గతి శక్తి ఇంజిన్లుగా పేర్కొన్నారు. ఈ ఏడు ఇంజిన్లు ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లనున్నాయి.

రవాణా రంగంలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.20 వేల కోట్లు వెచ్చించనున్నారు.

వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


బడ్జెట్ కేటాయింపులు..

మొత్తం బడ్జెట్ - రూ.39 లక్షల 45 వేల కోట్లు

లోటు బడ్జెట్ -రూ. 17 లక్షల కోట్లు

హోం శాఖ - రూ.1,85,776 కోట్లు

రక్షణ రంగం - రూ.5,25,166 కోట్లు

వ్యవసాయం, రైతు సంక్షేమం - రూ.1,32,513 కోట్లు

ఆహారం, ప్రజాపంపిణీ - రూ.2,17,684 కోట్లు

గ్రామీణాభివృద్ధి శాఖ - రూ.1,38,203 కోట్లు

ఆతిథ్య రంగం - రూ.5 లక్షల కోట్లు

సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు - రూ.2 లక్షల కోట్లు

రైల్వేలు - రూ.1,45,367 కోట్లు

రోడ్డు రవాణా, జాతీయ రహదారులు - రూ.1,99,107 కోట్లు

పెట్టుబడుల కోసం - రూ.10.68 లక్షల కోట్లు

ఈ సమావేశంలో సనత్ నగర్ బీజేపీ పరివార్ నాయకులు చరణ్ సింగ్, ఆకూరి శ్రీనివాస్ రావు, ఉత్తమ్ కుమార్ రాజ్ పురోహిత, కర్రే భాస్కర్, పొలిమేర సంతోష్ కుమార్,  వై యస్ రావు, సి వి శ్రీనివాస్, సుధాకర్ ముదిరాజ్, ఉమా, సరిత గౌడ్, మాధవి, తేజ విజయ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు