హైదరాబాద్, జూన్ 21 (ఇయ్యాల తెలంగాణ) : బిపోర్ జాయ్ తుపాను కారణంగా స్తంభించి పోయిన రుతుపవనాల్లో మళ్లీ కదలిక మొదలైంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల అవర్తనంతో రుతు పవనాలు మరింత చురుగ్గా కదులుతు న్నాయి. మరో నాలుగు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించనున్నాయి. పది రోజుల క్రితమే నైరుతి తెలుగు రాష్ట్రాలను తాకినా తుపాను కారణంగా అవి ముందుకు కదల్లేదు. శ్రీహరికోట ప్రాంతంలోనే స్తంభించిపోయాయి. తుపాను తీరం దాటడంతో ఆదివారం నుంచీ రుతుపవనాలు మళ్లీ చురుగ్గా కదలడం ప్రారంభించాయి. సోమవారం రాయలసీమ అంతటా విస్తరించాయి. దీంతో, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, కర్నూల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసాయి. రుతుపవ నాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గి, పలు ప్రాంతాల్లో ప్రజలకు ఉపశమనం లభించింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఈ రోజు కురిసిన జల్లులకు ప్రజలంతా ఆనంద పడ్డారు. వేడి కొంచం తగ్గినా ఇంకా పూర్తి ఉపశమనం అందలేదు. మరో రెండు రోజుల్లో వాతావరణం పూర్తిగా చల్ల బడే పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖా పేర్కొన్నది. ఉక్కిరి బిక్కిరితో ఎప్పుడు చల్లబడతామా ? అంటూ జనాలు ఎదురు చూస్తున్నారు.
రుతుపవనాల్లో కదలికలు..అక్కడక్కడ వానలు
Leave a Comment