మైనర్ బాలికకు న్యాయం చేయండి ?
నిందితుడికి ఉరే సరైన శిక్ష ?
మౌన దీక్షతో నిరసన తెలిపిన నాయకులు
హైదరాబాద్, మే 10 (ఇయ్యాల తెలంగాణ ) ఎంఐఎమ్ ఎమ్మెల్యే బలాలా అనుచరుడు చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దళిత మైనర్ బాలికను మానభంగం చేయడం అతనికి స్థానిక ఎమ్మెల్యే వత్తాసు పలకడం దౌర్భాగ్యమని బిజెపి ఎస్ సి మోర్చా నాయకులూ పొలిమేర సంతోష్ ఆవేదన వ్యక్తం చేశారు. భాగ్యనగరం లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఈ సంఘటనలో నిందితుడిని స్వయానా మజ్లీస్ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ నుండి తన పలుకుబడిని ఉపయోగించి విడిపించుకుపోవడం అత్యంత శోచనీయమని, ఈ విషయంలో అధికారులు ఎటువంటి వత్తిడికి తలొగ్గకుండా నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని భాజపా యువమోర్చా నాయకుడు పి సునీల్ కుమార్, దళిత మోర్చా నాయకుడు పొలిమేర సంతోష్ సనత్ నగర్ లో నిర్వహించిన ధర్నా అనంతరం డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లిప్తత కారణంగా మజ్లిస్ పార్టీ ఆగడాలకు అడ్డులేకుండా పోయిందని ఈ మధ్య భైంసా లో జరిగిన ఉదంతం పై కూడా తెరాస ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం మజ్లిస్ పార్టీ పట్ల ప్రభుత్వ మెతక వైఖరి అద్దం పడుతోందని అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న హోమ్ మంత్రి మహమూద్ అలీ వెంటనే రంగంలోకి దిగి నిశ్పాక్షిక విచారణ జరిపించాలని, ప్రభుత్వం కనీసం ఇప్పటికైనా మొద్దునిద్దుర నుండి లేచి దళితులపై జరుగుతున్న అకృత్యాలకు చరమగీతం పాడాలని భారతీయ జనతాపార్టీ సనత్ నగర్ నియోజకవర్గం సభ్యులందరూ ముక్తకంఠం తో ఖండిస్తున్నారని, నిందితుడిని శిక్షించేవరకు తీవ్రంగా ప్రతిఘటిస్తామని తెలియచేసారు.