మరోమారు పెట్రో ధరలు పెరగనున్నాయా?
వాహనదారుల్లో మొదలైన ఆందోళన
న్యూఢిల్లీ ,మే 18 (ఇయ్యాల తెలంగాణ ): లాక్డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ వాడకం భారీగా తగ్గంది. దీంతో పాటు పెట్రోలియం ఉత్పత్తులు ఎక్కువగా చేస్తూ ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేస్తున్న అరబ్
దేశాల్లో కూడా పెట్రోలియం నిల్వలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ప్రపంచ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు భారీగా పడిపోయాయి. అయినా మన దేశంలోమాత్రం పెట్రోల్ ధరలు తగ్గడం బదులు పెరిగాయి. ఇప్పటికే ధరలు పెంచిన కేంద్రం మరోమారు పెంచుతుందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిల్వ తగ్గించుకునేందుకు కొన్ని అరబ్ దేశాలు తమ వద్ద ఉన్న పెట్రోలియం నిల్వలను ఉచితంగా తీసుకువెళ్ళమని వివిధ దేశాలను కోరాయి. అనేక దేశాలు ఇప్పటికే వాటి వద్ద ఉన్న పెట్రోలియం స్టాక్ చేసుకునేందుకు ఉన్న సదుపాయాలన్నీ నిండిపోయాయి. కొత్తగా నిల్వలు చేసేందుకు కావాల్సిన సదుపాయాలు ఇప్పటికిప్పుడు కొద్దిరోజు కోసం ఏర్పాటు చేసుకునేందుకు కూడా ఇష్టపడడం లేదు. అదే సమయంలో పెట్రోలియం ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో నిల్వలు చేసేందుకు ఉన్న సదుపాయాలు కూడా ప్రస్తుతం లేదు. దీంతో పాటు ఇప్పటికే నిల్వ ఉన్న భారీ ట్యంకర్లకు రెంటు ఇచ్చుకోలేక ఉత్పత్తిదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో తమ వద్ద ఉన్న స్టాకును ఎలాగైనా వదిలించుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఇంత పరిస్థితి ఉన్నా మన దేశంలో మాత్రం పెట్రో ధరల్లో పెద్ద తేడా లేదు. లాక్డౌన్ పూర్తయిన తరువాత సహజంగానే ప్రపంచ వ్యాప్తంగా ధరలు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడే మన దగ్గర ఇలా ఉంటే ఇక లాక్డౌన్ ముగిసాక రేట్లు ఎంతలా పెరుగుతాయో అని పలువురు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర పెట్రోల్ ధర లీటరుకు రూ.73.97 ఉండగా డీజిల్ ధర లీటరుకు రూ.67.82 గా ఉంది. ఇటీవల ధరలను కేంద్రం భారీగా పెంచింది. మరోమారు పెంచుతుందన్న భయం కలుగుతోంది.