భారత ప్రజలకు లభించిన అమూల్యరత్నం బాబూ జగ్జీవన్‌ రామ్‌

నేడు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌ రామ్‌ వర్ధంతి జులై 6, (ఇయ్యాల తెలంగాణ ):

భారత ప్రజలకు లభించిన ‘అన్మోల్‌ రతన్‌’ (అమూల్యరత్నం) అని కితాబు పొందిన ప్రజాసేవకుడు, బాబూ జగ్జీవన్‌ రామ్‌. పండిట్‌ నెహ్రూ నుంచి కార్యదక్షుడిగా మన్ననలను పొంది, అగ్రశ్రేణి నాయకుల్లో ఒకడుగా, భారత స్వాతంత్య్ర ఉద్యమంలోను, నవభారత నిర్మాణంలో ఉదాత్తమైన పాత్ర నిర్వహించిన జగ్జీవన్‌ రామ్‌, 1908, ఏప్రిల్‌ 5న బిహార్‌ రాష్ట్రంలోని షాబాద్‌ జిల్లా, చాంద్వా గ్రామంలో బసంతీదేవి, శోభిరామ్‌ దంపతులకు జన్మించారు. అప్పటి ఆచారాల ప్రకారం 8వ ఏటనే బాల్యవివాహం జరిగింది. ప్రాథమిక పాఠశాల విద్య ముగిసిన తర్వాత 1928లో ఆయన కాశీని వదలి కలకత్తాకు వెళ్లి అక్కడ 1931లో బిఎస్సీ డిగ్రీని పొందారు. చదువుకునే రోజుల్లో మదన్‌ మోహన మాలవ్యా, పండిత గోవింద వల్లభ పంత్‌లతో పరిచయం ఏర్పడిరది. విద్యాభ్యాసం ముగిసిన తర్వాత బాబూ రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి దళితుల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1933లో భార్యా వియోగం జరగడంతో, 1935లో సంపన్న కుటుంబానికి చెందిన ‘ఇంద్రాణి’ని వివాహం చేసుకున్నారు. బిహార్‌ రాష్ట్ర హరిజన సేవా సంఘ కార్యదర్శిగా పనిచేసారు. బిహార్‌లో భూకంపం సంభవించినప్పుడు మహాత్మాగాంధీతో పాటు జగ్జీవన్‌ రామ్‌ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌, టక్కర్‌ బాబాల ఆశీర్వాదంతో రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం నుంచి నాటి శాసనసభకు ఎన్నికయ్యారు. 1935 ఇండియా చట్టం కింద రాష్ట్రాల్లో మంత్రివర్గాలు ఏర్పడినప్పుడు బిహార్‌ రాష్ట్ర మంత్రివర్గంలో ఆయన మొదటిసారి పార్లమెంటరీ కార్యదర్శి అయ్యారు. 1937లో బిహార్‌ రాష్ట్ర కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. వ్యష్టి సత్యాగ్రహంలో పాల్గొని హజారిబాగ్‌ జైల్లో ఉన్నప్పుడు ఆయనకు జయప్రకాశ్‌ నారాయణ్‌తో పరిచయం ఏర్పడిరది. డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌, జగ్జీవన్‌ రామ్‌, జయప్రకాశ్‌ నారాయణ్‌లు బిహార్‌ త్రిమూర్తులుగా పేరు తెచ్చుకున్నారు. 1946లో నెహ్రూ నాయకత్వంలో అవిభక్త భారత్‌లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో కార్మికశాఖను నిర్వహించారు. 1947లో అంతర్జాతీయ కార్మిక సమావేశంలో పాల్గొని తిరిగివస్తుండగా, బస్రా సవిూపంలో ఆయన ప్రయాణం చేస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. తీవ్రంగా గాయపడిన ఆయన నెల రోజులపాటు బ్రిటీష్‌ సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆ తర్వాత 1948లో హైదరాబాద్‌లో జరిగిన దళిత వర్గాల మహాసభకు ముదిగొండ లక్ష్మయ్య అధ్యక్షత వహించగా, జగ్జీవన్‌ రామ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 1952లో నెహ్రూ మంత్రివర్గంలో తపాలాశాఖను, 1956లో రైల్వేశాఖను నిర్వహించారు. తదనంతరం వ్యవసాయశాఖ మంత్రిగా దేశంలో హరి త విప్లవానికి కారణభూతుడై ఆహార ధాన్యాలను నిల్వ చేయడానికి వీలుగా ‘‘భారత ఆహార సంస్థ’’ (ఎఫ్‌సిఐ), సెంట్రల్‌ వేర్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌లను ఏర్పా టు చేశారు. నెహ్రూ అనంతరం లాల్‌బహదూర్‌ శాస్త్రీ, ఇందిరాగాంధీ మంత్రివర్గంలో మళ్లీ కార్మిక, ఉపాధి కల్పనాశాఖలు లభించాయి. 1967లో వ్యవసాయశాఖకు మారారు. కిద్వాయ్‌ తర్వాత వ్యవసాయశాఖను సమర్ధవంతంగా నిర్వహించారన్న పేరు సంపాదించుకున్నారు. కాంగ్రెస్‌ రెండుగా చీలినప్పుడు ఇందిరాగాంధీ పక్షాన ఉంటూ 1969లో బొంబాయిలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో జగ్జీవన్‌ రామ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా ఎంపికయ్యారు.  తర్వాతికాలంలో ఆయన రక్షణ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 1976లో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితికి నిరసనగా కాంగ్రెస్‌ పార్టీకి, మంత్రిపదవికి రాజీనామా చేశారు. తర్వాత కాంగ్రెస్‌ ఫర్‌ డెమోక్రసీ అనే పార్టీని స్థాపించారు. బాబూ జగ్జీవన్‌ రామ్‌ ప్రజాభిమానం కలిగిన నాయకులు. 1977, మార్చి 6న గుంటూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగాన్ని వినడానికి గత 38 ఏళ్లలో ఎన్నడూ రానంతమంది జనం వచ్చారు. రామ్‌కు ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ఇచ్చి సత్కరించింది. అలుపెరుగని తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానికి ఇక సెలవంటూ, 1986, జులై 6న ఈ లోకాన్ని వీడారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....