నేరచరిత రాజకీయాలకు – ఫుల్‌ స్టాప్‌ ఎప్పుడు ?

క్రైం పాలిటిక్స్‌ ? అంత మయ్యేదెన్నడు ?

క్రైం పాలిటిక్స్‌? ను మనదేశంలో తప్ప ఇంకెక్కడా మనం చూడం. ఎందుకంటే ఇక్కడ ఎంత ఎక్కువగా డబ్బుంటే అంత ఎక్కువగా ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉన్నట్లు.నేరాలు చేస్తే ఆ ఆర్హత ఇంకా పెరిగినట్టుగా ఉంటుంది. అలాంటి వారే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. మంత్రులవుతున్నారు. చివరికి రాష్ట్రాలను కూడా పాలిస్తున్నారు. రౌడీ, గూండా లాంటి బిరుదులు వాళ్ల పదవులకు ఎలాంటి ఆటకం కలిగించవు. గెలుస్తున్న ప్రతి ముగ్గురిలో ఒకరు నేర చరిత్ర కలిగి ఉంటున్నట్టు  ఏడిఆర్‌ సంస్థ రీసెర్చ్‌?లో వెల్లడయ్యింది. రాజకీయ పార్టీలు కూడా నేర చరిత్ర లేని వారికే టికెట్లు ఇస్తామని చెప్పే ధైర్యం చేయడం లేదు.నేర చరిత్ర ఉన్న రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు దేశానికి పెద్ద ఇబ్బందే. ఇలాంటి వారు అధికారంలో ఉండటం ప్రజాస్వామ్య మూలాలకే పెనుముప్పులాంటిది. 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో చట్ట సభలకు నేర చరిత్ర కలిగిన అభ్యర్థులు ఎన్నికయ్యే దౌర్భాగ్య పరిస్థితి నుంచి దేశం ఎప్పుడు బయట పడుతుందో. రాజకీయాల్లో నేరస్తుల ప్రవేశాన్ని కట్టడి చేయడానికి న్యాయ వ్యవస్థ దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంది. అయినా స్వార్థ సంకుచిత రాజకీయ పార్టీలు ఎన్నికల్లో నేర చరిత్ర కలిగిన అభ్యర్థులకు టికెట్లు కేటాయించడంలో పోటీ పడడం వల్ల చట్ట సభలు ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన సాంఘిక, ఆర్థిక, సామాజిక న్యాయం చేకూరని సంకట స్థితి నెలకొంది. ఎన్నికల కమిషన్‌, సుప్రీం కోర్ట్‌ చేసిన హెచ్చరికలను, ఆదేశాలను స్వార్థ రాజకీయ పార్టీలు పెడచెవిన పెట్టడం వల్ల రాజకీయాల్లో అవినీతి, బంధుప్రీతి, కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం వేళ్లూనుకొని పోయింది.

దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేల్లో దాదాపు 44 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్‌(ఏడీఆర్‌) నివేదిక వెల్లడిరచింది. రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వారు పోటీ చేసే సమయంలో సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించి ఏడీఆర్‌, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌లు ఈ వివరాలను వెల్లడిరచాయి. 22 రాష్ట్ర అసెంబ్లీలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 4,033 మంది ఎంఎల్‌ఎలకు గాను 4001 మంది ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించిన అనంతరం ఈ నివేదికను రూపొందించారు. వీరిలో 1,136 మంది అంటే 28 శాతం మంది తమపై హత్య, హత్యాయత్నం, కిడ్నాపింగ్‌, మహిళలపై నేరాలు లాంటి తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్నట్లు ప్రకటించింది.

కేరళలో మొత్తం 135 మంది ఎమ్మెల్యేలకు గాను.. 95 మందికి నేర చరిత్ర ఉందని, 70 శాతం నేరచరిత ఎమ్మెల్యేలతో ఆ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని నివేదికలు పేర్కొన్నాయి. అలాగే బీహార్‌లోని 242 మంది ఎమ్మెల్యేలలో 161 మంది (67 శాతం), ఢల్లీిలోని 70 మందిలో 44 మంది(63శాతం), మహారాష్ట్రలోని 284 మంది ఎమ్మెల్యేలలో 175 మంది(62 శాతం) తెలంగాణలోని 118 మంది శాసన సభ్యుల్లో 72 మంది(61శాతం), తమిళనాడులో224 మంది ఎమ్మెల్యేలలో 134 మంది(60 శాతం)తమపై క్రిమినల్‌ కేసులున్నట్లు అఫిడవిట్‌లలో పేర్కొన్నారు. అంతే కాకుండా ఢల్లీిలో 37 మంది (53 శాతం), బీహార్‌లో 122 మంది (50 శాతం) మహారాష్ట్రలో 114 మంది(40 శాతం), జార్ఖండ్‌లో 31మంది(39 శాతం), తెలంగాణలో46 మంది(39శాతం), ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం403 మంది ఎమ్మెల్యేలలో 155 మంది (38శాతం)తమపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్నట్లు వెల్లడిరచడం గమనార్హం. ఇందులో కూడా 114 మంది ఎంఎల్‌ఎలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు కూడాఆ వివరాలు వెల్లడిరచడం గమనార్హం. 1 14 మందిపై అత్యాచారానికి సంబంధించిన కేసులు కూడా ఉన్నట్లు ఈ నివేదికలో తెలిసింది.

పార్టీలవారీగా చూస్తే నేరచరిత ఉన్న ఎమ్మెల్యేల్లో ఎక్కు వ మంది బీజేపీకి చెందినవారని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ పార్టీకి చెందిన 1,356 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను పరిశీలించగా 473 మంది(35శాతం)కి నేరచరిత్ర ఉన్న ట్లు తేలిందని, వారిలో 337(25శాతం) మంది సీరియస్‌ నేరాల్లో నిందితులుగా ఉన్నట్లు పేర్కొంది. 2, 3 స్థానాల్లో కాంగ్రెస్‌, డీఎంకే పార్టీలుండగా.. వైఎస్సార్‌సీపీ 6, బీఆర్‌ఎస్‌ 8 స్థానాల్లో ఉన్నట్లు వివరించింది. 22వ స్థానంలో మజ్లిస్‌, 26వ స్థానంలో తెలుగుదేశం పార్టీలున్నాయి.ఈ నివేదిక క్రిమినల్‌ కేసులే కాకుండా ఎమ్మెల్యేల ఆస్తులను కూడా విశ్లేషించింది. రాష్ట్రాల్లోని ఎమ్మెల్యే తలసరి సగటు ఆస్తి రూ.13.63 కోట్లుగా ఉందని పేర్కొంది. అయితే క్రిమినల్‌ కేసులున్న వారి ఆస్తులు కేసులు లేని వారి సగటు ఆస్తులకన్నా ఎక్కు ఉండడం విశేషం. క్రిమినల్‌ కేసులు లేని ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.11.45 కోట్లుగా ఉండగా , కేసులున్న వారి సగటు ఆస్తి రూ.16.36 కోట్లుగా ఉంది. 

ఇదిలా ఉండగా..కర్ణాటక ఎమ్మెల్యేల సగటు ఆస్తుల విలువ రూ.64.39 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా.. రూ.28.24 కోట్ల సగటు ఆస్తులతో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో, రూ.23.51 కోట్లతో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉంది. కాగా అతితక్కువ ఆస్తుల విషయంలో రూ.1.54 కోట్లతో త్రిపుర మొదటి స్థానంలో ఉండగా, రూ.2.80 కోట్లతో పశ్చిమ బెంగాల్‌, రూ.3.15 కోట్లతో కేరళ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కాగా మొత్తం 4001 మంది ఎమ్మెల్యేల్లో రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్న వారు 88 శాతం ఉండడం విశేషం. ఈ విషయంలో కర్నాటక 32 మందితో అగ్రస్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో ఉంది. తెలంగాణ కింది నుంచి మూడో స్థానంలో ఉంది. బిలియనీర్లలో అత్యధికులు కాంగ్రెస్‌(33 మంది) ఉండగా.. వైసీపీ 8 మందితో మూడో స్థానంలో ఉంది. ఎమ్మెల్యేల్లో అత్యంత ధనికుడిగా కర్ణాటకకు చెందిన కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ (రూ.1,413 కోట్లు) ఉన్నారు.











iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....