హైదరాబాద్, జూలై 8, (ఇయ్యాల తెలంగాణ ): రాహుల్ గాంధీ మనసులో ఇంకా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నందుకు వైఎస్ షర్మిల సంతోషం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోనే దేశం ఉన్నతంగా పురోగమిస్తుందని వైఎస్ నమ్మకమని పేర్కొన్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ట్విట్టర్లో రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతూ షర్మిల రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్లో షర్మిల వైఎస్ఆర్ కమిటెడ్ కాంగ్రెస్ లీడర్ అని ..ప్రజల కోసం చనిపోయారన్నారు. రాజశేఖర్ రెడ్డిని .. కమిటెడ్ కాంగ్రెస్ లీడర్ అని చెప్పడం ద్వారా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి షర్మిల రెడీ అవుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో విబేధించి సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ఎప్పుడూ కాంగ్రెస్ నేతలను అభినందించిన దాఖలాలు లేవు.. దాదాపుగా ప్రతి ఏడాది కాంగ్రెస్ నాయకత్వ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున ఆయనను గుర్తు చేసుకుని నివాళులు అర్పిస్తూనే ఉంటుంది. అయితే వైఎస్ మరణం వెనుక సోనియా గాంధీ ఉందనే ఆరోపణలు కూడా గతంలో జగన్ చేశారు. కానీ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రం.. ఇలాంటి ప్రకటనలు చేయడం లేదు కానీ.. షర్మిల మాత్రం సొంత పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు .మామూలుగా షర్మిల పార్టీ విలీనం చర్చలు కొలిక్కి వచ్చాయని.. కానీ షర్మిలను ఏపీ రాజకీయాల్లోకి వెళ్లాలని హైకమాండ్ సూచిస్తోందని చెబుతున్నారు. అయితే షర్మిల మాత్రం తాను తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని పట్టుబడుతున్నారు. కానీ తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేతలు మాత్రం షర్మిలకు తెలంగాణ రాజకీయాల్లో చోటు లేదని చెబుతున్నారు. ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వరని.. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునరుజ్జీవం రావాలంటే.. షర్మిల వల్లే సాధ్యమవుతుందని అంటున్నారు. ఇటీవల విూడియాతో మాట్లాడిన కేవీపీ రామచంద్రరావు కూడా తనకు ఉన్నంత సమాచారం మేరకు.. షర్మిల కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నారని.. త్వరలో కీలక పరిణామాలు ఉంటాయని చెప్పారు. ఆ దిశగా ఇప్పుడుగు ముందడుగు పడుతున్నట్లుగా భావిస్తున్నారు.
విజయమ్మ భావోద్వేగం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఈ ఉదయం నివాళి అర్పించారు. ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆమె వెంట తల్లి విజయ, కుమారుడు రాజారెడ్డి, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న సందర్భంగా తల్లి విజయ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. కంట నీరు తుడుచుకుంటూ కనిపించారు. వైఎస్ జయంతి సందర్భంగా ఏటా జులై 8న వైస్ ఫ్యామిలీ మొత్తం కలుసుకునేది. అందరూ ఇడుపులపాయలో జరిగే ప్రార్థనల్లో పాల్గొనే వాళ్లు. కానీ వైఎస్ జగన్, షర్మిల మధ్య విభేదాలు కారణంగా వేర్వేరుగా వచ్చి నివాళి అర్పిస్తున్నారు. గతేడాది ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ ఒకరినొకరు పలకరించుకోలేదు. ఒకటిగానే వచ్చినా వేర్వేరుగానే ఉన్నారు. ఈసారి మాత్రం ఉదయం షర్మిల వచ్చి వెళ్లిపోయిన తర్వాత జగన్ వస్తున్నారు