కెసిఆర్,జగన్వి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు
పోతిరెడ్డి పాడు జివో అందులో భాగమే
దీనిపై కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు: పొన్నం
కరీంనగర్,మే14(ఇయ్యాల తెలంగాణ ): తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు సీఎంలు జగన్, కేసీఆర్వి మ్యాచ్ఫిక్సింగ్
రాజకీయాలని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. గతంలో పోతిరెడ్డిపాడుపై తీవ్ర విమర్శలు చేసిన సిఎం కెసిఆర్ నోరు ఇప్పుడు ఎందుకు పడి పోయిందన్నారు. 203జీవో ఇద్దరు సిఎం మధ్య అవగాహనలో భాగమేనని పొన్నం ఆరోపించారు. తెలంగాణ సాగునీటి ప్రయోజనాలను దెబ్బతీసేలా కృష్ణా జలాల తరలింపునకు ఏపీ ప్రభుత్వం మరో ఎత్తిపోత పథకం పేరుతో కుట్ర చేస్తోందని అన్నారు. ఇది తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో దీన్ని ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పక్షాన ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆనాడు కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం ఏ ప్రయోజనాల కోసం రాష్ట్రం ఇచ్చిందో.. ఇప్పుడు ఆ ప్రయోజనాలను దెబ్బతీసేలా ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరి స్తోందని మండిపడ్డారు. కృష్ణా జలాల వినియోగం తగ్గించేలా కేసీఆర్ ప్రభుత్వం ఇరిగేషన్ అధికారుతో ప్రతిపాదనలు చేయించిందని, ఆవెంటనే ఏపీ ప్రభుత్వం 3టీఎంసీ మిగలు జలాల కోసం జీవో 203 విడుదల చేసిందని, దీనివెనుక ఇద్దరు సీఎంల మధ్యనున్న మ్యాచ్ఫిక్సింగ్ ఏంటో అర్థమవుతోందన్నారు.
ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు వద్ద ఎత్తిపోతల పథకం పెట్టి కృష్ణా జలాలు తరలిస్తే భవిష్యత్లో సాగర్ ఆయకట్టు ఎండిపోకతప్పదని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా నీటి తరలింపు కోసం ఏపీ ప్రభుత్వం విడుద చేసిన 203 జీవోను నిరసిస్తూ కాంగ్రెస్ మరిన్ని ఆందోళనలు చేస్తుందన్నారు. ఇప్పటికే సాగర్ ఆయకట్టుకు నీరు లేక చివరి భూములు ఎండిపోతున్నాయని, ఈ పరిస్థితిలో మరిన్ని కృష్ణా జలాలు ఆంధ్రాకు తరలితే జిల్లాలు , రాష్ట్రం మరింత నష్టం పోవాల్సి వస్తుందన్నారు. తమ పార్టీ పక్షాన వ్యవహారం బయటపెట్టిన తర్వాతే కేసీఆర్ ప్రభుత్వం స్పందిస్తోందన్నారు. ఇప్పటికే సర్వేలు డిజైన్ల పక్రియ జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం దీనిని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాలు తరలిపోయి.. మహబూబ్నగర్, ఖమ్మం,నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగునీటి, హైదరాబాద్కు తాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్నారు. శ్రీశైం ఎగువనుంచి నీరు ఏపీకి తరలితే సాగర్ ఆయకట్టు బీడుగా మారే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని, ఆయన మాటలతో భవిష్యత్లో పెద్దనష్టం జరగబోతుందన్నారు. పోతిరెడ్డిపాడు వద్ద
బొక్కపెట్టి ఆంధ్రా వాసులు నీరు తీసుకుపోతుంటే నారక్తం మరిగిపోతుందని ఉద్యమ సమయంలో అన్న కేసీఆర్ ఈనాడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన ముఖ్యమంత్రి ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారో అర్థం కావడం లేదన్నారు. దీనిపై కాంగ్రెస్ పక్షాన దశల వారీగా ఆందోళనలు చేస్తామని, న్యాయపరంగా పోరాటాలు చేస్తామన్నారు.