తెరుచుకున్న బద్రీనాధ్ ఆలయం
పరిమిత సంఖ్యలో భక్తుల హాజరు
న్యూఢిల్లీ ,మే15 (ఇయ్యాల తెలంగాణ): శీతాకాల విరామం అనంతరం ఉత్తరఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయం తెరుచుకుంది. శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటలకు ఆలయం తలుపు తీశారు. అంతకు ముందు పూజారులు శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో పూజలు నిర్వహించారు. కపట్ ఓపెనింగ్ కార్యక్రమంలో లాక్డౌన్ కారణంగా ఆలయ ప్రధాన పూజరితో సహా కేవలం 28 మంది మాత్రమే హాజరయ్యారు. ఆలయం చుట్టూ బంతిపూలతో అందంగా అలంకరించారు. గత సంవత్సరం ఆలయం తెరిచిన మొదటి రోజు 10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కాని లాక్డౌన్ కారణంగా ఈ సంవత్సరం ఆ అవకాశం లేదు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రీవేంద్రసింగ్ రావత్, గవర్నర్ బేబీ రాణి మౌర్య ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఏప్రిల్ 30వ తేదీన తెరుచుకోవాల్సిన ఆలయం తలుపులు లాక్డౌన్ కారణంగా తెరుచుకోలేదని గుడి ధర్మాధికారి భవన్ చంద్ర ఉనియాల్ తెలిపారు. అలకనందా నది ఒడ్డున నార్, నారాయణ్ పర్వతాల మధ్య ఉన్న భద్రీనాథ్ ఆయం ప్రసిద్ధి చెందిన సుందర ప్రదేశంగా పేరు ఉంది.