శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాల ధరలు పెంచలేదు
భక్తుల రద్దీకి అనుగుణంగా రుచికరమైన అన్నప్రసాదాలు
టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి
తిరుమల,మార్చి 4 (ఇయ్యాల తెలంగాణ) : తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైన దర్శనం, రుచికర అన్నప్రసాదాలు అందించనున్నట్లు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పిఏసి ` 4 (పాత అన్నప్రసాద భవనం) లోని లగేజి సెంటర్ను శుక్రవారం ఉదయం అధికారులతో కలిసి ఛైర్మన్ తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఛైర్మన్ విూడియాతో మాట్లాడుతూ కోవిడ్ కారణంగా దాదాపు రెండు సంవత్సరాల తరువాత సామాన్య భక్తులకు సర్వదర్శనం ప్రారంభించి పదిరోజులవుతోందన్నారు. సర్వదర్శనం ప్రారంభమైన తరువాత తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందన్నారు.
యధావిధిగా ఆర్జిత సేవలు, దర్శనాలు కొనసాగుతాయి
ఇప్పటి వరకు సామాన్య భక్తులకు అందించే ఆర్జిత సేవలు, దర్శనాల ధరలను టిటిడి పెంచలేదని,పెంచే ఆలోచన ఇప్పట్లో లేదన్నారు. ధరల పెంపుపై కేవలం చర్చ మాత్రమే పాలకమండలిలో జరిగిందన్నారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడమే టిటిడి పాలకమండలి ముఖ్య ఉద్దేశమని, ఇందులో భాగంగా ఇప్పటికే శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి దర్శనాలను రద్దు చేశామని, దీని వల్ల సర్వదర్శనం టోకెన్లు పొందే సామాన్య భక్తులకు అదే రోజు దర్శనం జరుగుతోందని సుబ్బారెడ్డి వివరించారు. కొండ విూద ఆహారం విక్రయించరాదని బోర్డు తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరి ఉపాధికి ఇబ్బంది కలగని విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.