సనత్ నగర్, మార్చి 17 (ఇయ్యాల తెలంగాణ) : కాశ్మీర్ ఫైల్స్ చిత్రం ఆద్యంతం మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి గుండెలను పిండేలా ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు మరియు కర్ణాటక రాష్ట్ర మహిళా మోర్చా వ్యవహారాల ఇంచార్జి ఆకుల విజయ అన్నారు. 15 వ తేదీ మధ్యాహ్నం హైదరాబాద్ హైటెక్ సిటీ మెయిన్ రోడ్డులో గల పి వి ఆర్ ఐకాన్ థియేటర్ లో ఆమె కాశ్మీర్ ఫైల్స్ సినిమాను తిలకించారు. ఈ సందర్బంగా ఆకుల విజయ మాట్లాడుతూ 1990 లో కాశ్మీర్ పండిట్లు అనుభవించిన వెతలను కళ్ళకు కట్టినట్లు చిత్ర దర్శకులు వివేక్ అగ్నిహోత్రి అత్యంత హృద్యంగా సినిమాను చిత్రీకరించారన్నారు. అప్పట్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కాశ్మీరీ పండిట్లు తమ దేశ పౌరులు కాదన్నట్లు, వారిపై జరుగుతున్న ఆకృత్యాలను కట్టడి చేసేందుకు వీసమెత్తు ప్రయత్నం కూడా చేయలేదని ఆవేశం వ్యక్తం చేశారు. ఈ చిత్రం దర్శకుడు, నటులు, సాంకేతిక మరియు ఇతర సిబ్బంది సినిమా కు జీవం పోసారన్నారు.
ఈ చిత్రాన్ని ఎటువంటి కత్తిరింపులు లేకుండా విడుదల చేసిన సెన్సార్ బోర్డు ను కూడా వారు అభినందించారు. తమ దేశంలోనే ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉంటున్న ప్రజల కడగండ్లను తీర్చడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 370 ఆర్టికల్ ను రద్దు లాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని వారన్నారు. జాతీయ భావాలు గల ప్రతి భారతీయుడు ఈ సినిమాను తప్పకుండా సినిమా హాలులో వీక్షించాలని తద్వారా మరుగున పడ్డ ఇలాంటి అమానవీయ ఘటనలను చిత్రీకరించడానికి మరింత మంది దర్శకులు ముదుకు వస్తారని ఆమె తో పాటు సినిమాను వీక్షించిన సనత్ నగర్ బీజేపీ పరివార్ సభ్యులు యేచన్ సురేష్, తాళ్ల జైహింద్ గౌడ్, చరణ్ సింగ్, ఆకూరి శ్రీనివాస్ రావు, అడ్వకేట్ ప్రవీణ్ గౌడ్, పొలిమేర సంతోష్ కుమార్, కిరణ్ లు అన్నారు.