ఆలయ నిర్వహణలో టీటీడీ ప్రపంచానికే దిక్సూచి

 
 తిరుమల,  జూలై 23 (ఇయ్యాల తెలంగాణ ): వారణాసిలో ఆలయాల నిర్వహణపై అంతర్జాతీయ సమ్మేళనంలో టీటీడీ ఈవో  ధర్మారెడ్డి  ఆలయ నిర్వహణకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానములు(టీటీడీ) ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తోందని టీటీడీ ఈవో  ధర్మారెడ్డి వెల్లడిరచారు . ఆలయ నిర్వాహకుల దృఢ నిశ్చయం, లక్ష్యం, చిత్తశుద్ధి, భక్తి దేవాలయాల పరిపాలన, అభివృద్ధికి ఖచ్చితంగా ఉపయోగపడతాయని అన్నారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాసిలోని రుద్రాక్ష్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం నుండి మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనంలో ఈవో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 30 దేశాలకు చెందిన వివిధ హిందూ దేవాలయాల నిర్వాహకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రపంచ ప్రఖ్యాతిచెందిన పుణ్యక్షేత్రమైన తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు టీటీడీ కల్పిస్తున్న వసతులు, ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు, ఆలయ నిర్వహణకు సంబంధించిన పాలనా వ్యవస్థపై ఈవో అరగంటపాటు అందించిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ నిర్వాహకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా ఈవో ప్రసంగిస్తూ యాత్రికులకు శ్రీవారి దర్శనం, వసతి, తలనీలాలు, లడ్డూల తయారీ తదితర అంశాల్లో టీటీడీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తోందన్నారు. సమర్థ నిర్వహణ వల్లనే ఇది సాధ్యమైందని తెలిపారు. ఆలయం పవిత్రంగా ఉండాలని, చక్కటి పరిశుభ్రత పాటించాలని, భక్తులకు మంచి దర్శనం, వసతులు కల్పించాలన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్య, వైద్యం, అన్నదానం, వేద సంస్కృతి పరిరక్షణ చేపట్టాలన్నారు. టీటీడీ ఇలాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోందని వివరించారు. స్విట్జర్లాండ్‌, సింగపూర్‌ లాంటి దేశాల తరహాలో తిరుమలలో పారిశుద్ధ్యం ఉందన్నారు.         పురాతన ఆలయాల పునరుద్ధరణకు, మతమార్పిడులను అరికట్టేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రాంతాల్లో నూతన ఆలయాల నిర్మాణం కోసం శ్రీవాణి ట్రస్టును ప్రారంభించామని తెలిపారు. ఇప్పటివరకు 170 పురాతన ఆలయాల పునరుద్ధరణకు ఆర్థిక సాయం అందించామని, 300 ఆలయాల నిర్మాణం పూర్తయిందని, దాదాపు రెండు వేల ఆలయాలు వివిధ దశలో ఉన్నాయని చెప్పారు. భక్తులు దాదాపు 900 కోట్ల రూపాయలు శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు అందజేశారని, ఇప్పటివరకు 330 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని వివరించారు. ఈ ట్రస్టుకు రూ.10 వేలు విరాళం అందించిన దాతలకు ఒక బ్రేక్‌ దర్శనం టికెట్‌ అందజేస్తున్నామన్నారు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఏడాదిన్నర కిందట ప్రారంభించామన్నారు. ఇప్పటివరకు 1600కు పైగా గుండె శస్త్రచికిత్సలు, నాలుగు గుండె మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామని తెలియజేశారు. చిన్నపిల్లలకు కార్డియాలజీతోపాటు ఇతర విభాగాలతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోందని, డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.    

  

 టీటీడీ ఆధ్వర్యంలో 71 ఆలయాలు, 11 ట్రస్టులు, 14 ఆసుపత్రులు, 35 విద్యాసంస్థలు, 9 వేద పాఠశాలలు, నాలుగు గోశాలలు, 300 కళ్యాణ మండపాలు, 10 ధార్మిక సంస్థలు, నాలుగు భాషల్లో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌, అనాధ పిల్లల కోసం బాలమందిరం, రెండు మ్యూజియంలు ఉన్నాయన్నారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే తోటి భక్తులకు సేవలందించేందుకు 2000 సంవత్సరంలో శ్రీవారి సేవ విభాగాన్ని ప్రారంభించామని, ఇప్పటివరకు 14 లక్షల మంది సేవకులు నమోదయ్యారని తెలిపారు. ఇతర ఆలయాలు కూడా శ్రీవారి సేవ వ్యవస్థను ప్రారంభించాలని సూచించారు. శ్రీవారికి నైవేద్యం కోసం రసాయనాలు, పురుగుమందులు లేని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోస్తున్నామని తెలిపారు. ఇతర ఆలయాల్లో కూడా ఈ ఉత్పత్తులను వినిగించాలని కోరారు.  కోవిడ్‌ మహమ్మారి విజృంభించినప్పటి నుంచి శ్రీనివాస కళ్యాణం, వేంకటేశ్వర వైభవోత్సవాలు, గుడికో గోమాత కార్యక్రమం, విషూచిక మహామంత్రంతో పారాయణాలు ప్రపంచ భక్తుల దృష్టిని ఏ విధంగా ఆకర్షించాయో వివరించారు.అంతకుముందు, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌? (ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ శ్రీ మోహన్‌ భగత్‌ తన ప్రసంగంలో శ్రీవాణి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వెనుకబడిన ప్రాంతాల్లో నూతన ఆలయాల నిర్మాణం, శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునరుద్ధరణను పెద్దఎత్తున చేపట్టినందుకు టీటీడీని ప్రశంసించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....