న్యూయార్క్, జూలై 22, (ఇయ్యాల తెలంగాణ ):పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ ఐ’ సినిమా కోసం ఇండియా వైడ్ గా ఉన్న సినీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ‘ప్రాజెక్ట్ ఐ’ సినిమా టైటిల్ అండ్ గ్లిమ్స్ ని అమెరికాలో శాన్ డీయాగో కామిక్ ఖాన్ ఈవెంట్లో రివిల్ చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రభాస్, కమలహాసన్, నాగ్ అశ్విన్ అమెరికా వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా అమెరికాలోని ప్రభాస్ అభిమానులు డార్లింగ్ కి వినూత్న రీతిలో వెల్కమ్ చెబుతూ వారి అభిమానాన్ని చాటుకున్నారు. జూలై 20వ తేదీన ‘ప్రాజెక్ట్ ఐ’ మూవీ ప్రతిష్టాత్మకమైన శాన్ డియాగో కామిక్ ఖాన్ ఈవెంట్లో పాల్గొంది.ఈ సందర్భంగా శాన్ డియాగో లోని ప్రభాస్ ఫ్యాన్స్ ఏకంగా కార్ ర్యాలీ నిర్వహించారు. శాన్ డీయాగోలో ఫ్యాన్స్ అంత భారీగా కార్ ర్యాలీ చేపట్టారు. అనంతరం అభిమానులు కార్లను ‘ప్రాజెక్ట్ ఐ’ అనే పేరు వచ్చేలా లోగో రూపంలో పార్క్ చేస్తూ సందడి చేశారు. అంతేకాకుండా అభిమానులంతా ప్రాజెక్ట్ ఐ ప్రత్యేక టీషర్టులను ధరించి ప్రభాస్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోను చిత్ర యూనిట్ సోషల్ విూడియాలో షేర్ చేస్తూ శాన్ డీయాగోలోని ప్రభాస్ ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ విూడియాలో వైరల్ అవుతూ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ ని సైతం ఎంతగానో ఆకట్టుకుంటుంది.మరోవైపు ఇప్పటికే ‘ప్రాజెక్ట్ ఐ’ మూవీ యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ టైటిల్ అండ్ గ్లిమ్స్ వీడియో ఫాన్స్, తో పాటూ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఇక ప్రాజెక్ట్ ఐ సినిమాకి ‘కల్కి 2898 ంఆ’అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇక గ్లిమ్స్ విషయానికొస్తే.. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ లు హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ప్రభాస్ ని కల్కి అవతారంలో ఉన్న సూపర్ మ్యాన్ లా చూపించారు. ‘ఎప్పుడైతే అంధకారం ప్రపంచాన్ని ఆక్రమిస్తుందో అప్పుడు ఓ శక్తి ఉద్భవిస్తుంది. అంతం అనేది ఇప్పుడు ఆరంభమవుతుంది’ అనే డైలాగ్స్ తో సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేసారు. అంతేకాకుండా ఇదొక టైం ట్రావెల్ కథ అని గ్లిమ్స్ చూస్తేనే అర్థమవుతుంది.దుష్ట శక్తుల నుండి ప్రపంచాన్ని కాపాడే కల్కి అవతారంలో ప్రభాస్ ని చూపించబోతున్నాడు దర్శకుడు నాగ అశ్విన్. సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బానర్ పై సీనియర్ నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రభాస్ కి జోడిగా దీపికా పదుకొనే నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్, కమలహాసన్, దిశాపటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.