చిక్కుల్లో ఉద్ధవ్ ఠాక్రే సర్కారు
ముంబై జూన్ 21 (ఇయ్యాల తెలంగాణ) : మహారాష్ట్రలోని శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి కూటమికి షాక్ తగిలింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు గుజరాత్లో క్యాంప్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో మహారాష్ట్రలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో శివసేన నేతృత్వంలోని ఎంవీఏ కూటమికి ప్రతిపక్ష బీజేపీ పార్టీ షాక్ ఇవ్వగా.. మంగళవారం ఎమ్మెల్యే గుజరాత్లోని సూరత్ చేరుకున్నారు.వీరంతా గుజరాత్కు చెందిన కీలక నేతలతో టచ్లో ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామంతో ఉద్ధవ్ ఠాక్రే సర్కారు చిక్కుల్లో పడ్డట్లయ్యింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శివసేన ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండేతో 10`12 మంది ఎమ్మెల్యేలు గుజరాత్లోని ఓ హోటల్లో క్యాంప్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏక్నాథ్ షిండే సోమవారం నుంచి పార్టీకి అందుబాటులో లేకుండాపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై కేంద్రమంత్రి, బీజేపీ నేత నారాయణ్ రాణేను ప్రశ్నించగా.. స్పందించేందుకు నిరాకరించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్
మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలు సోమవారం జరిగాయి. ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. పది స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార మహా వికాస్ అఘాదికి మరోసారి ఎదురుదెబ్బ తలింది. ప్రతిపక్ష బీజేపీ ఐదుస్థానాల్లో గెలుపొందగా.. శివసేన, ఎన్సీపీ పార్టీలు చెరో రెండు స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించింది. రాజ్యసభ ఎన్నికల ఫలితాలే పునరావృతమయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. 55 మంది ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలకు మద్దతిచ్చిన కేవలం శివసేనకు 52 ఓట్లు మాత్రమే వచ్చాయి.

